Thu Mar 19 2026 06:06:50 GMT+0530 (India Standard Time)
చెరువులో దొంగ.. టెన్షన్ లో పోలీసులు
హైదరాబాద్ శివారు సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ దొంగ పోలీసులను

హైదరాబాద్ శివారు సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ దొంగ పోలీసులను బాగా టెన్షన్ పెట్టాడు. ఓ ఇంటిలో దొంగతనం చేసి పారిపోయే క్రమంలో చెరువులో దూకి, మధ్యలో రాయి ఉంటే దానిపై కూర్చుండిపోయాడు. అతని కోసం పోలీసులు రాత్రి వరకు వేచి చూశారు. అతనిని చెరువు మధ్యలో నుంచి బయటకు రప్పించేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశారు. సూరారం పరిధిలోని న్యూ శివాలయానికి చెందిన నందకుమార్ శుక్రవారం ఇంటికి తాళం వేసి భార్యతో కలిసి నర్సాపూర్ వెళ్లాడు. అతని ఇద్దరు పిల్లలు స్కూల్కు వెళ్లారు. సాయంత్రం ఓ దొంగ ఇంటి తాళం పగలగొట్టి లోనికి వెళ్లాడు. బీరువా తెరిచి చోరీ చేస్తుండగా.. నందకుమార్ కూతురు స్కూల్ నుంచి వచ్చింది. ఆమె రాకను చూసిన దొంగ ఇంటిపక్కనే ఉన్న చెరువులో దూకాడు.
శుక్రవారం సాయంత్రం సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ఇంట్లోకి జొరబడి దొంగతనం చేశాడు. అతను బయటకు వెళ్లేలోపు ఇంటి యజమాని వచ్చాడు. అక్కడి నుంచి తప్పించుకునే క్రమంలో కొంతదూరంలోని చెరువులో దూకాడు. ఈదుకుంటూ వెళ్లి చెరువు మధ్యలో ఉన్న బండరాయిపై కూర్చున్నాడు. విషయం తెలియగానే ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు అతనిని బయటకు రప్పించే ప్రయత్నాలు చేసి విఫలమయ్యారు. పోలీసులు ఎంత నచ్చజెప్పినా బయటకు రాలేదు. టీవీ ఛానల్స్ ను కూడా తీసుకుని రమ్మని డిమాండ్ చేశాడు. దీంతో పోలీసులు మీడియాని పిలిపించి నీ డిమాండ్స్ ఏమిటో చెప్పమని అడిగారు. ఆ దొంగ ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి వస్తేనే చెరువులో నుండి బయటకు వస్తానని చెప్పాడు. అతడి కోసం అర్ధరాత్రి 12:30 వరకూ కూడా పోలీసులు ఎదురుచూశారు.
Next Story

