Sat Dec 13 2025 22:34:14 GMT+0000 (Coordinated Universal Time)
Hyderabad : ప్రత్యూష కేసులో ఏం జరగబోతుంది?
ఇరవై ఏళ్ల క్రితం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సినీ నటి ప్రత్యూష మృతి కేసు విచారణ తుది దశకు చేరుకుంది.

ఇరవై ఏళ్ల క్రితం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సినీ నటి ప్రత్యూష మృతి కేసు విచారణ తుది దశకు చేరుకుంది. ఈ కేసులో నిందితుడు సిద్ధార్థ రెడ్డికి హైకోర్టు విధించిన జైలుశిక్షను సవాల్ చేస్తూ ఆయన దాఖలు చేసిన అప్పీల్పైనా, శిక్షను పెంచాలని కోరుతూ ప్రత్యూష తల్లి సరోజినీదేవి వేసిన పిటిషన్పైనా సుప్రీంకోర్టు తన తీర్పును రిజర్వ్లో ఉంచింది. జస్టిస్ రాజేశ్ బిందల్, జస్టిస్ మన్మోహన్లతో కూడిన ధర్మాసనం ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో తీర్పు ఎలా వెలువడనుందన్న ఆసక్తి నెలకొంది.
ఇరవై ఏళ్ల క్రితం జరిగిన...
2002లో ఈ ఘటన జరిగింది. అప్పట్లో ఈకేసు సంచలనంగా మారింది. హైదరాబాద్లో ఇంటర్ చదువుతున్న సమయంలో ప్రత్యూష, సిద్ధార్థ రెడ్డి ప్రేమించుకున్నారు. 2002 ఫిబ్రవరి 23న వీరిద్దరూ పురుగుమందు తాగిన స్థితిలో ఆసుపత్రిలో చేరగా, చికిత్స పొందుతూ మరుసటి రోజు ప్రత్యూష మరణించింది. సిద్ధార్థ రెడ్డి కోలుకున్నాడు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన సీబీఐ, ఆత్మహత్యకు ప్రేరేపించారన్న ఆరోపణలతో సిద్ధార్థ రెడ్డిపై ఛార్జిషీట్ దాఖలు చేసింది. ఈ కేసును విచారించిన హైదరాబాద్ మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టు 2004లో సిద్ధార్థ రెడ్డికి ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది.
తీర్పు రిజర్వ్ చేసిన...
దీనిపై నిందితుడు హైకోర్టును ఆశ్రయించగా, 2011లో ఉన్నత న్యాయస్థానం శిక్షను రెండేళ్లకు తగ్గించి, జరిమానాను యాభై వేల రూపాయలకు పెంచింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సిద్ధార్థ రెడ్డి, శిక్షను పెంచాలని కోరుతూ ప్రత్యూష తల్లి సరోజినీదేవి 2012లో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టులో సీబీఐ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ప్రత్యూషను ఆత్మహత్యకు పురికొల్పినందుకు నిందితుడికి పూర్తి స్థాయి శిక్ష విధించాలని కోరారు. అయితే నిందితుడి తరఫు న్యాయవాదులు వాదిస్తూ.. ఇద్దరూ కలిసే విషం తాగారని, కాబట్టి ఇది ఆత్మహత్యకు ప్రేరేపించడం కిందకు రాదని తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం, తుది తీర్పును రిజర్వ్లో ఉంచింది. ఈ కేసులో తీర్పు ఏ రకంగా వస్తుందన్నది చూడాలి.
Next Story

