Fri Dec 05 2025 12:45:29 GMT+0000 (Coordinated Universal Time)
Vinayaka Chavithi : గణేశుడిని పూజించిడం ఇలా.. నియమాలు ఇవే
వినాయక చవితి రోజు . గణేశుడి ప్రతిమను తెచ్చుకోవడం నుంచి పూజ చేసే వరకూ సాగే ఈ పూజ ఎంతో శక్తిని ప్రసాదిస్తుందని పూర్వీకులు చెబుతారు.

వినాయక చవితి సందర్భంగా అందరి ఇళ్లలో ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది.వినాయక చవితి రోజు గణేశుడి ప్రతిమను తెచ్చుకోవడం నుంచి పూజ చేసే వరకూ సాగే ఈ పూజ ఎంతో శక్తిని ప్రసాదిస్తుందని పూర్వీకులు చెబుతారు. అందుకే గణేశ్ చతుర్ధి నాడు చిన్నారులను కదలనివ్వకుండా పూజ వద్ద కూర్చోబెట్టి మరీ పెద్దలు వారి చేత పూజలు చేయించడంతో పాటు వారికి వినాయక కథను విని తీరాలంటారు. అందువల్ల వారిలో ఉన్న ఆత్మనూన్యత తొలిగిపోవడంతో పాటు సద్భుద్ధులు అలవరుచుకుంటారని నమ్ముతారు. అయితే ఇంట్లోనే వినాయకుడిని ప్రతిష్టించి ఎలా పూజలు నిర్వహించాలన్న అనుమానం అందరిలోనూ ఉంది. అయితే అలాంటి వారికి వినాయకున్ని ఎలా పూజించాలి. ఎలాంటి నియమాలు పాటించాలో పండితులు ఏం చెబుతున్నారంటే?
ఉదయం నుంచి...
ప్రతి ఇంటి గడపకు పసుపు కుంకుమ, గుమ్మానికి తోరణాలు, పూజా మందిరములో ముగ్గులతో అలంకరించుకోవాలి. ఆకుపచ్చరంగు పట్టు వస్త్రాలు ధరించి.. పూజకు ఉపయోగపడే వస్తువులు, పటములకు గంధము, కుంకుమతో అలంకరించుకోవాలి. ఆకుపచ్చ రంగు వస్త్రాన్ని కప్పిన కలశమును, గణేశుడి ప్రతిమను పూజకు సిద్ధం చేసుకోవాలి. పసుపురంగు అక్షింతలు, కలువ పువ్వులు, బంతి పువ్వులు, చామంతి మాలలతో గణపతిని అలంకరించుకోవాలి. నైవేద్యానికి ఉండ్రాళ్ళు, బూరెలు, గారెలు, వెలక్కాయ వంటివి తయారు చేసుకోవాలి. దీపారాధనకు రెండు కంచు దీపాల్లో ఏడు జిల్లేడు వత్తులను ఉంచి, కొబ్బరినూనెతో దీపమెలిగించి పూజా ప్రారంభించాలి. విగ్రహాన్ని పూజకు ఉపయోగించిన పక్షంలో... మండపంపై విగ్రహం ఉంచి పవిత్ర జలంపై పాదాల్ని కడగాలి. తర్వాత పాలు, పెరుగు, నెయ్యి, తేనె, బెల్లంతో పంచామృత స్నానం చేయించాలి. ప్రతి అమృతానికి నడుమ నీటితో శుభ్రం చేస్తుండాలి.
నిమజ్జనం వరకూ...
తర్వాత వినాయక ప్రతిమకు గంధం, అద్ది, ఎరుపులేదా, పసుపు పువ్వులతో అలంకరించుకోవాలి. అలాగే చతుర్థినాడు మట్టితో తయారు చేసిన బొమ్మను పూజలో ఉంచడం శ్రేష్ఠమని పండితులు చెబుతున్నారు. కర్పూర హారతులను సమర్పించేందుకు ముందు గణపతి అష్టోత్తరము, రుణవిమోచక గణపతి స్తోత్రమ్, గణపతి సహస్రనామం, శ్రీ గణేశారాధనలతో స్తుతించడం లేదా "ఓం గం గణపతయే నమః" అనే మంత్రమును 108 సార్లు జపించాలి. తర్వాత నేతితో పంచహారతులివ్వడమో, లేదా కర్పూర హారతులు సమర్పించుకోవాలి. ఇకపోతే.. ఇంట్లో పూజకోసం ఉంచిన మట్టి విగ్రహాన్ని నిమజ్జనం చేసే వరకు ఉదయం, సాయంత్రం రెండు పూటలా నైవేద్యం పెట్టి, హారతి ఇస్తుండాలి. పూజ పూర్తయ్యాక అక్షింతలు చల్లి, విగ్రహాన్ని కదిలించాలి. తప్పుల్ని క్షమించమని కోరుతూ పూజ ముగించాలి. ఇలా చేస్తే అష్టైశ్వర్యాలతో పాటు ఉన్నత చదువులకు అవకాశం ఉంటుందని పెద్దలు చెబుతారు. వినాయక వ్రత కల్పం చదివేంత వరకూ ఏమీ తినకూడదని కూడా పెద్దలు చెబుతారు.
Next Story

