Mon Dec 08 2025 17:43:18 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: ఉత్తర పాకిస్తాన్లో రేడియేషన్ లీక్ను ధృవీకరిస్తూ వైరల్ అవుతున్న పాకిస్తాన్ ప్రభుత్వ లేఖ నకిలీది
పాకిస్తాన్లోని కిరానా హిల్స్ లోని అణ్వాయుధ కేంద్రంపై భారతదేశం దాడి చేసిందనే ఊహాగానాలు వినిపించాయి. ఆపరేషన్ సిందూర్లో

Claim :
ఉత్తర పాకిస్తాన్లో రేడియేషన్ లీక్ను ధృవీకరిస్తూ పాకిస్తాన్ ప్రభుత్వం లేఖను విడుదల చేసింది.Fact :
ఆ లేఖ నకిలీది, అందులో స్పెల్లింగ్, వ్యాకరణ తప్పులు ఉన్నాయి.
పాకిస్తాన్లోని కిరానా హిల్స్ లోని అణ్వాయుధ కేంద్రంపై భారతదేశం దాడి చేసిందనే ఊహాగానాలు వినిపించాయి. ఆపరేషన్ సిందూర్లో భాగంగా పాకిస్తాన్లోని కిరానా హిల్స్ పై బాంబులు వేసిందనే వార్తలను భారత్ ఖండించింది. పాకిస్తాన్ అణు స్థావరాల మీద దాడి చేయలేదని ఎయిర్ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్ ఎయిర్ మార్షల్ ఏకే భారతి తెలిపారు. ఆ కొండలో అణుస్థావరం ఉన్నట్లు తమకు తెలీదని, అయితే ఈ రహస్యం చెప్పినందుకు థాంక్యూ అని ఏకే భారతి అన్నారు. సర్గోదా ఎయిర్బేస్కు రోడ్డుమార్గంలో కిరానా హిల్స్ కేవలం 20కిలో మీటర్ల దూరంలో ఉంది.
భారత క్షిపణుల దాడి తర్వాత రేడియేషన్ లీక్ అయిందని అనేక మంది సోషల్ మీడియా వినియోగదారులు పోస్ట్ చేసారు. ఇంతలో, పాకిస్తాన్ ప్రభుత్వం జారీ చేసిన రేడియోలాజికల్ సేఫ్టీ బులెటిన్ అని చెప్పుకునే ఒక లేఖ కూడా వైరల్ అవుతూ ఉంది. ఉత్తర పాకిస్తాన్లోని అణు కేంద్రం వద్ద రేడియేషన్ లీక్ అయిందని ఆ లేఖలో ఉంది. ముఖ్యంగా ఈ లేఖలో పాకిస్తాన్ ప్రభుత్వ లోగో ఉంది. మినిస్ట్రీ ఆఫ్ క్లైమేట్ ఛేంజ్ అండ్ ఎన్విరాన్మెంటల్ కో ఆర్డినేషన్ పేరుతో ఆ లేఖ ఉంది. ఆ లేఖ మీద మే 13, 2025 అనే తేదీ ఉంది.
‘న్యూక్లియర్ రేడియేషన్ నిర్ధారించారు’ వంటి కామెంట్స్ తో చాలా మంది సోషల్ మీడియా వినియోగదారులు లేఖను పంచుకున్నారు. కొంతమంది వినియోగదారులు ఈ లేఖను “పాకిస్తాన్ ప్రభుత్వం ఉత్తర పాకిస్తాన్లో రేడియేషన్ను నిర్ధారించింది.” అనే శీర్షికతో మరికొందరు పంచుకున్నారు.
వైరల్ క్లెయిమ్ కు సంబంధించిన ఆర్కైవ్ లింక్ ను ఇక్కడ చూడొచ్చు .
ఫ్యాక్ట్ చెక్:
వైరల్ అవుతున్న లేఖ నకిలీది.
ముందుగా, పాకిస్తాన్ నివేదించిన ఏదైనా రేడియేషన్ లీక్ గురించి మేము శోధించినప్పుడు, అటువంటి వాటి గురించి మాకు ఎటువంటి నివేదికలు దొరకలేదు. భారతీయ లేదా పాకిస్తాన్ మీడియా సంస్థలు రేడియేషన్ లీక్ గురించి నివేదించలేదు.
మేము పాకిస్తాన్లోని నేషనల్ రేడియోలాజికల్ సేఫ్టీ డివిజన్ కోసం శోధించినప్పుడు మాకు అలాంటి సంస్థకు సంబంధించిన వివరాలు ఏదీ దొరకలేదు. కానీ పాకిస్తాన్ అటామిక్ ఎనర్జీ కమిషన్ అనే సంస్థ సోషల్ మీడియా పేజీ మాకు దొరికింది.
మేము వాతావరణ మార్పు, పర్యావరణ సమన్వయ మంత్రిత్వ శాఖ కోసం శోధించినప్పుడు, 'మినిస్ట్రీ ఆఫ్ క్లైమేట్ ఛేంజ్' మంత్రిత్వ శాఖ పేరు మాత్రమే కనిపించింది. ఎన్విరాన్మెంటల్ కో ఆర్డినేషన్ మీద ఎలాంటి ప్రభుత్వ పరమైన శాఖ కనిపించలేదు. వైరల్ లేఖలో ప్రస్తావించిన ఇమెయిల్ చిరునామా [email protected] అని ఉంది. అయితే పాకిస్తాన్ ప్రభుత్వ ఇమెయిల్ IDలు ‘.gov.pk’ తో ముగుస్తాయి. @env.gov.pk అనేది రిజిస్టర్డ్ డొమైన్ కాదు.
వైరల్ లేఖలో మాకు అనేక స్పెల్లింగ్ మిస్టేక్స్, వ్యాకరణ దోషాలు కనిపించాయి. 'కాన్ఫిడెన్షియల్', 'నార్తర్న్' లాంటి పదాల స్పెల్లింగ్ లు తప్పుగా ఉన్నాయి. ఇక టైమ్ కు సంబంధించి 24.55 అని ఉంది. దీన్ని ఉపయోగించరు. అది 00.55 అయి ఉండాలి.
తప్పులను హైలైట్ చేస్తూ లేఖకు సంబంధించిన చిత్రం ఇక్కడ ఉంది.
"రేడియోలాజికల్ సేఫ్టీ బులెటిన్ పాకిస్తాన్" అనే పదాలను ఉపయోగించి మేము శోధించినప్పుడు, దాని గురించి మాకు ఎటువంటి సమాచారం దొరకలేదు. పాకిస్తాన్ న్యూక్లియర్ రెగ్యులేటరీ అథారిటీ అనేది ప్రభుత్వ నియంత్రణ సంస్థ అని కూడా మాకు లభించింది, 'మాలిక్ అసద్ రఫీక్, డైరెక్టర్ జనరల్, NRSD' కోసం వెతికినప్పుడు, ఆ సంస్థ, సదరు వ్యక్తి గురించి మాకు ఎటువంటి సమాచారం లభించలేదు.
కనుక, వైరల్ అవుతున్న లేఖ నకిలీది. ఉత్తర పాకిస్తాన్లో రేడియేషన్ లీక్ అయిందనే వాదన నిజం కాదు.
Claim : ఉత్తర పాకిస్తాన్లో రేడియేషన్ లీక్ను ధృవీకరిస్తూ పాకిస్తాన్ ప్రభుత్వం లేఖను విడుదల చేసింది
Claimed By : Social media users
Claim Reviewed By : Telugupost Fact Check
Claim Source : Social media
Fact Check : False
Next Story

