Sat Feb 07 2026 04:14:06 GMT+0530 (India Standard Time)
ఫ్యాక్ట్ చెక్: పాత వీడియోను USA జట్టు టీ20 ప్రపంచ కప్ కోసం భారత్ లోకి అడుగు పెట్టగానే పానీ పూరీ తిన్నట్లుగా ప్రచారం చేస్తున్నారు
USA జట్టు టీ20 ప్రపంచ కప్ కోసం భారత్ లోకి అడుగు పెట్టగానే పానీ పూరీ

Claim :
అమెరికా క్రికెట్ జట్టు టీ20 ప్రపంచ కప్ కోసం భారత్ లోకి అడుగు పెట్టగానే పానీ పూరీ తిన్నదిFact :
గతంలో చోటు చేసుకున్న వీడియోను ఇటీవలిదిగా ప్రచారం చేస్తున్నారు
టీ20 ప్రపంచ కప్-2026 కు సమయం ఆసన్నమైంది. ఫిబ్రవరి 06న వాంఖడే స్టేడియంలో అమెరికాతో జరిగే ఐసిసి పురుషుల T20 ప్రపంచ కప్ 2026 టైటిల్ డిఫెన్స్ను భారత్ ప్రారంభించనుంది. ప్రస్తుత ఛాంపియన్ అయిన భారత్ మళ్లీ ట్రోఫీని గెలుచుకోవడం ద్వారా చరిత్ర సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. భారతదేశం- USA గతంలో T20 అంతర్జాతీయ మ్యాచ్లలో ఒకసారి మాత్రమే తలపడ్డాయి. న్యూయార్క్లో జరిగిన 2024 T20 ప్రపంచ కప్లో రెండు జట్ల మధ్య జరిగిన పోరులో భారత జట్టు గెలిచింది. అమెరికా జట్టులో ఎక్కువగా భారత్, పాకిస్థాన్ సంతతికి చెందిన ఆటగాళ్లు ఉన్నారు.
USA క్రికెట్ జట్టు లోగో ఉన్న టీ-షర్టులు ధరించి పానీ పూరీ తింటున్న పలువురు వ్యక్తులను చూపించే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. ఇది ఇటీవల ముంబైలో జరిగిన సంఘటన అని పేర్కొన్నారు. ICC పురుషుల T20 ప్రపంచ కప్ టోర్నమెంట్ కోసం భారతదేశానికి వచ్చిన USA క్రికెట్ జట్టు సభ్యులు ముంబైలోని రోడ్డు పక్కన ఉన్న స్టాల్లో పానీ పూరీని ఆస్వాదిస్తున్నట్లు సోషల్ మీడియా వినియోగదారులు పేర్కొన్నారు.
"ఫిబ్రవరి 7వ తేదీన టి20 ప్రపంచ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇప్పటికే ఇండియాకు చేరుకుంది యూఎస్ఏ క్రికెట్ టీం. అయితే ఇండియాకు చేరుకున్న యూఎస్ఏ క్రికెటర్లు వీధుల్లో తిరుగుతూ ఎంజాయ్ చేస్తున్నారట. ఇందులో భాగంగానే పానీ పూరి తింటున్న ఫోటోలు కూడా వైరల్ గా మారాయి. ఇండియాలో పానీ పూరి బాగా ఫేమస్." అంటూ కథనాన్ని ప్రచురించారు.
వైరల్ పోస్టులకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ ను ఇక్కడ చూడొచ్చు
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. ఇది ఇటీవల చోటు చేసుకున్న ఘటన కాదు.
మేము సంబంధిత కీవర్డ్స్ తో గూగుల్ సెర్చ్ చేశాం. అయితే ఇటీవలి కాలంలో అమెరికా జట్టు అలా ముంబై వీధుల్లో తిరిగినట్లుగా ఎలాంటి నివేదికలు లభించలేదు. ఆ జట్టు సోషల్ మీడియా ఖాతాలను కూడా మేము గమనించాం. ఎక్కడా కూడా ఈ వీడియోను 2026 టీ20 ప్రపంచ కప్ కోసం భారత్ కు వచ్చిన సందర్భంగా రికార్డు చేసినట్లు లేదు.
వైరల్ వీడియోకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ ను తీసుకుని గూగుల్ లెన్స్ ద్వారా సెర్చ్ చేశాం. శ్రీగణేష్ పానిపురి అనే ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ పోస్ట్ చేసిన వీడియో మాకు లభించింది. వైరల్ వీడియోలో చూపిన విధంగా ఈ హ్యాండిల్ USA క్రికెట్ జట్టు సందర్శించిన అదే పానీ పూరీ స్టాల్కు చెందినదని మేము కనుగొన్నాం. అయితే ఆ వీడియో పాతదని, ఫిబ్రవరి 2025 నాటిదని గుర్తించాం.
USA క్రికెట్ జట్టు సందర్శించిన పానీ పూరీ స్టాల్ ముంబైలో కాదు, గుజరాత్లోని ఆనంద్లో ఉంది.
దీన్ని క్యూగా తీసుకుని మేము కీవర్డ్స్ సెర్చ్ చేయగా అమెరికా జట్టుకు సంబంధించిన ఆటగాళ్లు గుజరాత్ లో పర్యటించినట్లుగా పలు కథనాలు మాకు లభించాయి. అది కూడా 2025 సంవత్సరం నాటిది. ఆ కథనాలు ఇక్కడ, ఇక్కడ ఉన్నాయి.
అప్పట్లో ICC CWC లీగ్ 2 మ్యాచ్లో USA జాతీయ క్రికెట్ జట్టు నమీబియా క్రికెట్ జట్టుతో ఆడాల్సి ఉంది. ఆ సమయంలో గుజరాత్లోని ఆనంద్లో చాలా మంది USA ఆటగాళ్ళు జట్టు జెర్సీని ధరించి కనిపించారు. వారు పానీ పూరిని రుచి చూశారు. సంజయ్ కృష్ణమూర్తి, ఆరోన్ జోన్స్, ఉత్కర్ష్ శ్రీవాస్తవ వీధి ఆహారాన్ని ఆస్వాదిస్తూ కనిపించారని నివేదికలు తెలిపాయి.
కాబట్టి, పాత వీడియోను ఇటీవలి వీడియోగా అభిప్రాయపడ్డారు.
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.
Claim : గతంలో చోటు చేసుకున్న వీడియోను ఇటీవలిదిగా ప్రచారం చేస్తున్నారు
Claimed By : Social Media Users
Claim Reviewed By : Telugu Post Fact Check
Claim Source : Social Media
Fact Check : False
Next Story

