Sat Dec 13 2025 22:31:45 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: బాలీవుడ్ లెజెండరీ నటుడు ధర్మేంద్రకు సంబంధించిన లేటెస్ట్ విజువల్స్ అంటూ జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదు
వైరల్ అవుతున్నవి ధర్మేంద్రకు సంబంధించిన పాత విజువల్స్

Claim :
నటుడు ధర్మేంద్రకు సంబంధించిన లేటెస్ట్ విజువల్స్ ఇవిFact :
వైరల్ అవుతున్నవి ధర్మేంద్రకు సంబంధించిన పాత విజువల్స్. ఈ వీడియో ఏప్రిల్ 17, 2025 నాటిది
బాలీవుడ్ లెజెండరీ నటుడు ధర్మేంద్ర ఆసుపత్రి పాలయ్యారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కారణంగా అక్టోబర్ 31న ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో చేరిన ఆయన, నవంబర్ 12 ఉదయం ఇంటికి చేరుకున్నారు. ఆయనకు ఇంట్లోనే చికిత్స కొనసాగుతుందని వైద్యులు తెలిపారు. ధర్మేంద్రను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేసినట్లు ఆయనకు చికిత్స అందించిన డాక్టర్ ప్రతిత్ సందానీ పీటీఐకి వెల్లడించారు. కుటుంబ సభ్యుల నిర్ణయం మేరకు ఆయనకు ఇంట్లోనే వైద్య సేవలు కొనసాగిస్తామని వివరించారు.
ధర్మేంద్ర మరణించారంటూ తప్పుడు వార్తలు కూడా ప్రచారమయ్యాయి. ఈ వదంతులపై ఆయన కుటుంబ సభ్యులు తీవ్రంగా స్పందించారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, కోలుకుంటున్నారని స్పష్టం చేశారు. పలు పుకార్లను ఆయన కుమార్తె ఈషా డియోల్ ఖండించారు. "కొన్ని మీడియా సంస్థలు తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నాయి. మా నాన్నగారు క్షేమంగా ఉన్నారు, కోలుకుంటున్నారు. దయచేసి మా కుటుంబానికి ప్రైవసీ ఇవ్వండి. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థించిన వారికి ధన్యవాదాలు" అని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. ధర్మేంద్ర భార్య, నటి హేమమాలిని కూడా ఈ తప్పుడు వార్తలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. "చికిత్సకు స్పందిస్తూ కోలుకుంటున్న వ్యక్తి గురించి ఇలాంటి అసత్య ప్రచారాలు చేయడం క్షమించరానిది. ఇది చాలా బాధ్యతారాహిత్యం. దయచేసి కుటుంబ గోప్యతను గౌరవించండి" అని ఆమె సోషల్ మీడియాలో కోరారు.
ఇంతలో ధర్మేంద్రకు సంబంధించిన కొన్ని విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ధర్మేంద్ర ఫిజియోథెరపీ తీసుకుంటూ ఉన్న వీడియోలు ఇటీవలి విజువల్స్ అంటూ ప్రచారం చేస్తున్నారు.
ధర్మేంద్ర బతికే ఉన్నారని, లేటెస్ట్ విజువల్స్ అంటూ సోషల్ మీడియాలో పోస్టులను పెట్టారు.
"Dharmendra Health Update
Live: अस्पताल में भर्ती धर्मेंद्र की हालत स्थिर, सनी देओल ने कहा-अफवाहों से बचें" అనే టైటిల్ తో పోస్టులు పెట్టారు.
వైరల్ పోస్టులకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ ను ఇక్కడ చూడొచ్చు
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న పోస్టులు ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ ఉన్నాయి. ఈ విజువల్స్ ఇటీవలివి కావు.
ధర్మేంద్ర ఆరోగ్యానికి సంబంధించిన కథనాలను మేము పరిశీలించాం. ఆయన ఆసుపత్రి నుండి నవంబర్ 12న డిశ్ఛార్జ్ అయ్యారంటూ పలు మీడియా కథనాలు మాకు లభించాయి.
సినీ ప్రముఖుడు ధర్మేంద్ర నవంబర్ 12 బుధవారం ముంబైలోని బ్రీచ్ కాండీ హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నట్లు ఫిర్యాదు చేయడంతో ఆయన అక్టోబర్ 31న ఆసుపత్రిలో చేరినట్లు సమాచారం. నవంబర్ 12 తేదీ ఉదయం, ఆసుపత్రి నుండి నటుడి ఇంటికి అంబులెన్స్ బయలుదేరడం కనిపించింది. ఆసుపత్రిలో ధర్మేంద్రకు చికిత్స చేస్తున్న డాక్టర్ ప్రొఫెసర్ ప్రతీత్ సమదానీ ఆయన చికిత్స ఇంట్లోనే కొనసాగుతుందని మీడియాకి ధృవీకరించారు. "ధర్మేంద్రజీ ఉదయం 7.30 గంటల ప్రాంతంలో ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు. కుటుంబం ఆయనకు ఇంటి వద్దే చికిత్స అందించాలని నిర్ణయించినందున ఆయనకు ఇంట్లోనే చికిత్స అందించనున్నాము" అని బ్రీచ్ కాండీ హాస్పిటల్కు చెందిన డాక్టర్ ప్రొఫెసర్ ప్రతీత్ సమదానీ మీడియాకి తెలిపారు.
అందుకు సంబంధించిన కథనాలను ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ చూడొచ్చు.
వైరల్ విజువల్స్ కు సంబంధించిన స్క్రీన్ షాట్స్ ను తీసుకుని గూగుల్ లో రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేశాం.
ఏప్రిల్ 18, 2025 నాటి టెల్లీ చక్కర్ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ లో “Veteran Bollywood actor Dharmendra continues to defy age with his unwavering commitment to fitness. At 89, the legendary actor recently shared a video on Instagram showcasing his physiotherapy session, assuring fans that he is working hard to stay fit and healthy.” అంటూ ఈ వీడియోను పోస్టు చేశారని మేము చూశాం.
మా మరింత పరిశోధనలో ధర్మేంద్ర అధికారిక ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్లో ఏప్రిల్ 17, 2025న పోస్ట్ చేశారు. తాను ఫిట్గా ఉన్నానని, యోగా, వ్యాయామం, ఫిజియోథెరపీ అందుకు కారణమని తెలిపారు. “Friends, with your good wishes and His blessings I am working hard to be fit and fine — yoga, exercise and… now physiotherapy.” అంటూ క్యాప్షన్ తో పోస్టు పెట్టారు.
ధర్మేంద్ర ఫిజియోథెరపీకి సంబంధించిన వార్తలను ఏప్రిల్ 2025న పలు మీడియా సంస్థలు కూడా ప్రచురించాయి. ఆ కథనాలను ఇక్కడ, ఇక్కడ చూడొచ్చు.
కాబట్టి, వైరల్ అవుతున్న వాదనలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ ఉన్నాయి.
Claim : వైరల్ అవుతున్నవి ధర్మేంద్రకు సంబంధించిన పాత విజువల్స్. ఈ వీడియో ఏప్రిల్ 17, 2025 నాటిది
Claimed By : Social Media Users
Claim Reviewed By : Telugu Post
Claim Source : Social Media
Fact Check : Misleading
Next Story

