Fri Dec 05 2025 20:53:35 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: మంజీరా డ్యామ్ కు పగుళ్లు అంటూ జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని తెలిపిన తెలంగాణ ప్రభుత్వం
ఇవన్నీ అవాస్తవాలని కొట్టేసిన తెలంగాణ ప్రభుత్వం

Claim :
మంజీరా డ్యామ్ కు పగుళ్లు ఏర్పడ్డాయిFact :
ఇవన్నీ అవాస్తవాలని కొట్టేసిన తెలంగాణ ప్రభుత్వం
గోదావరి నది ఉపనది మంజీరా. మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల గుండా ప్రవహిస్తుంది. మహారాష్ట్రలోని బీఢ్ జిల్లా, పటోడా తాలూకాలోని బాలాఘాట్ పర్వతశ్రేణి యొక్క ఉత్తరపు అంచుల్లో 823 మీటర్ల ఎత్తున పుట్టి, గోదావరి నదిలో కలుస్తుంది. మహారాష్ట్రలోని ఉస్మానాబాద్, కర్ణాటకలోని బీదర్, తెలంగాణలోని మెదక్ జిల్లాల గుండా 512 కిలోమీటర్లు ప్రవహించి, సంగారెడ్డి వద్ద దిశను మార్చి ఉత్తరంగా ప్రవహిస్తుంది. ఈ నది జన్మస్థానం నుండి గోదావరిలో కలిసే దాకా మొత్తం 724 కిలోమీటర్లు ప్రవహిస్తుంది.
సంగారెడ్డి జిల్లాలో ఉన్న మంజీరా డ్యామ్ కొన్ని లక్షల మందికి దాహార్తిని తీరుస్తూ ఉంది. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలకే కాకుండా ఆ చుట్టు పక్కల ప్రాంతంలో కొన్ని లక్షల మందికి నీటిని సరఫరా చేస్తుంది మంజీరా డ్యామ్. అయితే ఈ డ్యామ్ కు పగుళ్లు ఏర్పడ్డాయని పలు కథనాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
"మంజీరా బ్యారేజీ పిల్లర్లకు పగుళ్లు
నీటి పారుదల శాఖ నిర్లక్ష్యంతో ప్రమాదంలో పడ్డ జంట నగరాలకు మంచి నీరు అందించే బ్యారేజీ
మరమ్మతులు చేయకపోవడంతో కొట్టుకుపోయిన ఆప్రాన్ (కాంక్రీట్ నిర్మాణం)
బ్యారేజీ పిల్లర్లు(పియర్లు) కొట్టుకుపోయాయని, తుమ్మ చెట్లు పెరగడంతో మట్టికట్ట బలహీనపడిందని, ఆప్రాన్ కొట్టుకుపోవడంతో బ్యారేజీ దిగువన భారీ గుంతలు ఏర్పడ్డాయి" అంటూ పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
వైరల్ అవుతున్న పోస్టులకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ ను ఇక్కడ చూడొచ్చు
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనల్లో ఎలాంటి నిజం లేదని తెలంగాణ ప్రభుత్వం తెలిపింది.
సంబంధిత కీవర్డ్స్ తో మేము గూగుల్ సెర్చ్ చేయగా తెలంగాణ నీటిపారుదల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బొజ్జా మంజీరా బరాజ్ ను జూన్ 27, 2025న పరిశీలించి కీలక ప్రకటన చేశారు.
సంగారెడ్డి జిల్లా కల్పగూరులోని మంజీరా బరాజ్ ఎలాంటి డేంజర్లో లేదని నీటిపారుదల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బొజ్జా స్పష్టంచేశారు. ఆయన మంజీరా బరాజ్ను సందర్శించారు. మంజీరా బరాజ్, బరాజ్ గేట్లు, ఇతర నిర్మాణాలను పరిశీలించారు. మంజీరా బరాజ్ పిల్లర్లకు ఏమైనా పగుళ్లు వచ్చాయా? అనే కోణంలో ఇరిగేషన్, హెచ్ఎండబ్ల్యూఎస్ అధికారులతో కలిసి తనిఖీ చేశారు. బరాజ్ దిగువన అఫ్రాన్ దెబ్బతిన్నదని, మరమ్మతుల కోసం రూ.3 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేశామని, త్వరలోనే పనులు చేపడతామని వెల్లడించారు.
ఇదే విషయాన్ని పలు తెలుగు మీడియా సంస్థలు నివేదించాయి. "Manjira Dam: మంజీరా డ్యామ్కు పగుళ్లు వచ్చాయన్న వార్తలు అవాస్తవం: రాహుల్ బొజ్జా" అంటూ ఈనాడు కథనాన్ని మీరు చూడొచ్చు.
నీటిపారుదల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బొజ్జా మంజీరాను పరిశీలించిన తర్వాత చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో లింక్స్ ను ఇక్కడ చూడొచ్చు.
హైదరాబాద్ మెట్రో పాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవేజ్ బోర్డు కూడా మంజీరా బ్యారేజ్ కు ఎలాంటి పగుళ్లు రాలేదని వివరణ ఇచ్చింది. "మంజీరా బ్యారేజీకి ముప్పులేదు..
# మంజీరా డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టు ఆధునికీకరణ కోసం రూ. 600 కోట్లు
# రూ. 3.52 కోట్లతో తక్షణ మరమ్మతులు
# బ్యారేజీని సందర్శించిన జల మండలి ఎండీ అశోక్ రెడ్డి.
హైదరాబాద్ మహానగరానికి తాగునీరు అందించే మంజీరా బ్యారేజీకి ఎలాంటి ముప్పులేదని జలమండలి ఎండీ అశోక్రెడ్డి స్పష్టం చేశారు. ఆయన జలమండలి ఉన్నతాధికారులతో కలిసి శనివారం మంజీరా బ్యారేజ్, బారాజ్ గేట్లు, బారాజ్ పిల్లర్లు, పంప్హౌజ్లను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఎండీ మాట్లాడుతూ.. హైదరాబాద్ నగరానికి మంచినీరు అందించడానికి నిర్మించిన మంజీరా బ్యారేజ్కు ఎలాంటి ప్రమాదం లేదని, వివిధ మాధ్యమాల్లో బారాజ్ పిల్లర్లకు పగుళ్లు వచ్చాయన్న వార్తలు అవాస్తవమని చెప్పారు. అలాగే బ్యారేజ్కి సంబంధించిన గేట్లు, రోప్ల పనితీరు కూడా సంతృప్తిగానే ఉన్నట్లు చెప్పారు. అయితే బారాజ్ దిగువన ఆఫ్రాన్ కొంతమేరకు దెబ్బతిన్నదని వెంటనే మరమ్మత్తులకోసం ఏజెన్సీతో మాట్లాడి యుద్ధప్రాతిపదికన పనులు చేపట్టాలని ఆదేశించారు. అలాగే రెండవగేటు లీకేజీను అరికట్టడానికి మరమ్మత్తు పనులను చేపట్టాలని స్వప్న ప్రాజెక్టు ప్రైవేట్ లిమిటెడ్ నిర్మాణ సంస్థకు సూచించారు." అంటూ ట్వీట్ లో వివరించారు.
మంజీరా డ్యామ్ కు పగుళ్లు ఏర్పడ్డాయంటూ వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎలాంటి నిజం లేదని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది.
Claim : ఇవన్నీ అవాస్తవాలని కొట్టేసిన తెలంగాణ ప్రభుత్వం
Claimed By : Social Media Users
Claim Reviewed By : Telugu Post
Claim Source : Social Media
Fact Check : False
Next Story

