Fri Feb 27 2026 17:56:17 GMT+0530 (India Standard Time)
ఫ్యాక్ట్ చెక్: ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతున్నప్పుడు ఇజ్రాయెల్ ప్రతిపక్షాలు వాకౌట్ చేయలేదు
ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతున్నప్పుడు ఇజ్రాయెల్ ప్రతిపక్షాలు

Claim :
ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతున్నప్పుడు ఇజ్రాయెల్ ప్రతిపక్షాలు వాకౌట్ చేశాయిFact :
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు
భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇజ్రాయెల్ పర్యటన ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఫిబ్రవరి 25, 26 తేదీల్లో ఇజ్రాయెల్లో పర్యటించిన మోదీ.. అక్కడి పార్లమెంట్లో మాట్లాడారు. 2017 తర్వాత ప్రధాని మోదీ ఇజ్రాయెల్ వెళ్లడం ఇదే తొలిసారి. టెల్ అవీవ్ చేరుకున్న మోదీకి ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఎయిర్పోర్ట్లో ఘన స్వాగతం పలికారు.
ఇజ్రాయెల్ పార్లమెంట్ అయిన 'నెస్సెట్' ను ఉద్దేశించి ప్రసంగించిన మొట్టమొదటి భారత ప్రధానిగా నరేంద్ర మోదీ చరిత్ర సృష్టించారు. ఆయన 30 నిమిషాల ప్రసంగానికి అక్కడి చట్టసభ సభ్యులంతా నిలబడి స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారు.ఇజ్రాయెల్ పార్లమెంట్ ఇచ్చే అత్యున్నత పురస్కారాల్లో ఒకటైన 'స్పీకర్ ఆఫ్ ది నెస్సెట్ మెడల్' ను మోదీకి ప్రదానం చేశారు. ఈ గౌరవం అందుకున్న తొలి విదేశీ నేత మోదీనే కావడం విశేషం. ఉగ్రవాదం వల్ల కలిగే బాధ ఏంటో 26/11 ముంబై దాడులు చూసిన భారత్కు బాగా తెలుసని ఆయన గుర్తుచేశారు. ఉగ్రవాదం పట్ల 'జీరో టాలరెన్స్' తో వ్యవహరించాలని స్పష్టం చేస్తూ.. ఈ కష్టకాలంలో ఇజ్రాయెల్కు భారత్ అండగా ఉంటుందని చెప్పారు.
ప్రధాని మోదీ ప్రసంగాన్ని ఇజ్రాయెల్ ప్రతిపక్షం బహిష్కరిస్తున్నట్లు చూపించే ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను షేర్ చేస్తూ, “మోదీ మాట్లాడబోయే ముందు ఇజ్రాయెల్ పార్లమెంట్లోని మొత్తం ప్రతిపక్షం వాకౌట్ చేసింది." అంటూ పోస్టులు పెట్టారు.
భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించడానికి ముందు, అక్కడి ప్రతిపక్ష నాయకులంతా సభ నుంచి వాకౌట్ చేశారని, మోదీ ప్రసంగాన్ని వారు బాయ్కాట్ చేశారని నెటిజన్లు ఆ వీడియోను షేర్ చేస్తున్నారు
వైరల్ పోస్టులకు సంబంధించిన ఆర్కైవ్ లింక్స్ ను ఇక్కడ, ఇక్కడ చూడొచ్చు
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. ప్రతిపక్షాలు వాకౌట్ చేసింది మోదీ ప్రసంగానికి కాదు, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, స్పీకర్ అమీర్ ఒహానాల ప్రసంగాల సమయంలో.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఈ ప్రత్యేక సమావేశానికి ఆహ్వానించకపోవడాన్ని నిరసిస్తూ.. అక్కడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాత్రమే ప్రతిపక్షాలు సభ నుంచి బయటకు వెళ్లాయి. కానీ ప్రధాని మోదీ ప్రసంగం ప్రారంభం కావడానికి ముందే వాళ్లంతా తిరిగి సభలోకి వచ్చారు.
ఫిబ్రవరి 25న ప్రధాని మోదీని సత్కరిస్తున్న ఇజ్రాయెల్ ప్రత్యేక శాసనసభ సమావేశం నెస్సెట్ టీవీలో ప్రత్యక్ష ప్రసారం చేశారు. 24 నిమిషాల తర్వాత, ప్రధాని మోదీతో పాటు బెంజమిన్ నెతన్యాహు, అమీర్ ఒహానా పార్లమెంటులో ఉన్నారు, అక్కడ శాసనసభ్యులు చప్పట్లతో ఆయనకు స్వాగతం పలికారు. స్పీకర్ ఒహానా ప్రధాని మోదీ, ఇతర ప్రతినిధి బృంద సభ్యులను స్వాగతిస్తూ మాట్లాడటం ప్రారంభించగానే, ప్రతిపక్ష శాసనసభ్యులు 26.12 నిమిషాల సమయంలో వెళ్ళిపోతున్నట్లు వైరల్ వీడియోలో ఉన్నట్లుగా కనిపించింది.
ప్రతిపక్ష నాయకులు లేనప్పుడు నెతన్యాహు నెస్సెట్ను ఉద్దేశించి ప్రసంగించారు. గత 12 సంవత్సరాలుగా మోడీ నాయకత్వంలో రెండు దేశాల మధ్య వ్యూహాత్మక, ఆర్థిక సహకారం బలోపేతం కావడాన్ని ఆయన హైలైట్ చేశారు.
నెతన్యాహు ప్రసంగం ముగియగానే, యైర్ లాపిడ్ నేతృత్వంలో ప్రతిపక్ష సభ్యులు మధ్యాహ్నం 1.02 గంటల తర్వాత హాలులోకి నడిచారు. ఆ తర్వాత లాపిడ్ స్పీకర్ పక్కన కూర్చున్న మోదీ వద్దకు వెళ్లి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఆయన మైక్ తీసుకుని, “మిస్టర్ ప్రైమ్ మినిస్టర్, ఈరోజు జరిగినదానికి మీతో సంబంధం లేదని మీకు తెలియజేస్తున్నాను. మీ నాయకత్వం, మీ స్నేహం, కష్టకాలంలో మీరు మా కోసం ఇక్కడ ఉన్నారనే వాస్తవం, శాశ్వత మైత్రి పట్ల ఇజ్రాయెల్ మొత్తం రుణపడి ఉంది. మీ ప్రసంగం కోసం అన్ని వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.” అని చెప్పారు. "సభలో జరిగిన వాకౌట్కు, మీకు ఎలాంటి సంబంధం లేదు. మేమంతా మీ ప్రసంగం కోసమే ఎదురుచూస్తున్నాము" అని స్పష్టం చేశారు. మోదీ సభను ఉద్దేశించి ప్రసంగించేటప్పుడు సభ్యులందరూ అక్కడే ఉన్నారు.
మోదీ ప్రసంగం సమయంలో ప్రతిపక్షాలు వాకౌట్ చేయలేదని ఇది నిర్ధారిస్తుంది, లాపిడ్ స్వయంగా ఆయన ప్రసంగం కోసం ఎదురు చూస్తున్నామని చెప్పారు.
ఫిబ్రవరి 25న, యైర్ లాపిడ్ ప్రధాని మోదీతో కలిసి ఉన్న ఫోటోను కూడా పోస్ట్ చేశారు. “ఇజ్రాయెల్ దేశం మొత్తం మీ నాయకత్వాన్ని అభినందిస్తుంది, మీ స్నేహానికి విలువ ఇస్తుంది. కష్ట సమయాల్లో మీరు మాకు తోడుగా నిలిచినందుకు కృతజ్ఞత చూపిస్తున్నాం. ఇక్కడికి వచ్చినందుకు ధన్యవాదాలు” అని ఆయన Xలో పోస్ట్కు క్యాప్షన్ ఇచ్చారు.
పలు మీడియా సంస్థలు కూడా మోదీ ప్రసంగం సమయంలో ప్రతి పక్షాలు వాకౌట్ చేయలేదు అంటూ ధృవీకరిస్తూ కథనాలను ప్రచురించాయి. వాటిని ఇక్కడ, ఇక్కడ చూడొచ్చు.
కాబట్టి, వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.
Claim : వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు
Claimed By : Social Media Users
Claim Reviewed By : Telugupost Fact Check
Claim Source : Social Media
Fact Check : False
Next Story

