ఫ్యాక్ట్ చెక్: రేవంత్ రెడ్డి “ముస్లింలు మంత్రి పదవులను నిర్వహించలేరు” అని అన్నారనేది నిజం కాదు
Telangana CM Revanth Reddy did not say Muslims can’t handle ministerial posts.

Claim :
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముస్లింలు మంత్రి పదవులను నిర్వహించలేరని చెప్పినట్లుగా వైరల్ ఈ-పేపర్ క్లిప్లో ఉందిFact :
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలాంటి వ్యాఖ్యలు చేయలేదు. వాదన నిజం కాదు
2025 అక్టోబర్ 21న జరిగిన పోలీసు సంస్మరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోలీసు అధికారులను ఉద్దేశించి ప్రసంగించారు. మావోయిస్టులు ఆయుధాలను వదులుకుని జనజీవనంలోకి చేరాలని ఆయన కోరారు. 2025 అక్టోబర్ 17న నిజామాబాద్లో కత్తిపోట్లకు గురై మరణించిన సిసిఎస్ కానిస్టేబుల్కు ఆయన నివాళులర్పించారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన ధైర్యవంతులైన పోలీసు అధికారులకు నివాళులు అర్పిస్తూ గోషామహల్ స్టేడియంలో కొత్త స్మారక చిహ్నాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు.
ఆయన తన ప్రసంగంలో అనేక అంశాల గురించి మాట్లాడారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ‘ముస్లింలు మంత్రి పదవులను సరిగా నిర్వహించలేరు’ అని చెప్పారని సోషల్ మీడియాలో ఒక వార్తాపత్రిక క్లిప్పింగ్ చక్కర్లు కొడుతోంది. వార్తాపత్రిక పేరు ఎక్కడా కనిపించని క్లిప్పింగ్ ఇది. తెలుగులో ఈపేపర్ క్లిప్పింగ్లోని వచనం ఇలా ఉంది
“ముస్లింలు మంత్రి పదవిని హ్యాండిల్ చేయలేరు - పోలీసు అమరవీరుల సంస్మరణ సభలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు.
ముస్లిం సోదరులు ప్రభుత్వాన్ని అర్థం చేసుకోవాలి, వారికి పెద్ద పదవులు ఇవ్వలేను
గతంలో కేసీఆర్ మహమ్మద్ అలీకి హెూమ్ శాఖ ఇస్తే సరిగ్గా హ్యాండిల్ చేయలేదు
జనాభా లెక్కల ప్రకారం చూస్తే, ముస్లింలకు కార్పొరేటర్ సీటు కూడా ఇవ్వకూడదు
నా సహకారంతోనే అజహరుద్దీన్ లాంటి ముస్లింలు ఎమ్మెల్సీలు అవుతున్నారు
ముస్లింలకు పదవుల మీద ఆసక్తి లేదు, వారు ఎప్పుడు కాంగ్రెస్ పార్టీకి సేవకులు
అమీర్ అలీ ఖాన్ ఎమ్మెల్సీ త్యాగం చేసినట్టు ముస్లిం సోదరులు త్యాగాలు చేయాలి
అజారుద్దీను జూబ్లీహిల్స్ టికెట్ ఇస్తే కచ్చితంగా ఓడిపోతాడనే ఇవ్వలేదు
గోషామహల్, హైదరాబాద్, అక్టోబర్ 21, న్యూస్ టుడే: హైదరాబాద్లో జరుగుతున్న పోలీసు అమరవీరుల సంస్మరణ సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ క్రమంలో గోషామహల్లోని స్టేడియంలో ప్రారంభమైన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ముస్లింలకు మంత్రి పదవి ఇచ్చే విషయంపై ఆయన క్లారిటీ ఇచ్చారు. ముస్లిం సోదరులు ప్రభుత్వాన్ని అర్ధం చేసుకోవాలని, వారికి పెద్ద పదవులు ఇవ్వలేను అని సీఎం రేవంత్ రెడ్డి కుండా బద్దలు కొట్టారు. గతంలో కేసీఆర్ మహమ్మద్ అలీకి హోమ్ శాఖ ఇస్తే సరిగ్గా హ్యాండిల్ చేయలేదని ఆయన గుర్తు చేశారు. జనాభా లెక్కల ప్రకారం చూస్తే, ముస్లింలకు కార్పొరేటర్ సీటు కూడా ఇవ్వకూడదు కానీ, నా సహకారంతోనే అజహరుద్దీన్ లాంటి ముస్లింలు ఎమ్మెల్సీలు అయ్యారని రేవంత్ రెడ్డి తెలిపారు. ముస్లింలకు పదవుల మీద ఆసక్తి లేదని, వారు ఎప్పుడు కాంగ్రెస్ పార్టీకి సేవకులు అని మరోసారి ముస్లింలపై ప్రశంసల వర్షం కురిపించారు. అమీర్ అలీ ఖాన్ ఎమ్మెల్సీ త్యాగం చేసినట్టు ముస్లిం సోదరులు త్యాగాలు చేయడానికి సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. అజారుద్దీన్ క్కు జూబ్లీహిల్స్ టికెట్ ఇస్తే కచ్చితంగా ఓడిపోతాడనే ఇవ్వలేదని రేవంత్ రెడ్డి మరోసారి స్పష్టం చేశారు.”
ఈ ఈపేపర్ క్లిప్పింగ్ను అనేక మంది సోషల్ మీడియా వినియోగదారులు వివిధ ప్లాట్ఫామ్లలో పంచుకున్నారు.
వైరల్ పోస్టు స్క్రీన్ షాట్ ను ఇక్కడ చూడొచ్చు.
ఫ్యాక్ట్ చెక్:
వైరల్ అవుతున్న వాదన నిజం కాదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలాంటి ప్రకటన చేయలేదు. వైరల్ అవుతున్న వార్తాపత్రిక క్లిప్పింగ్ నకిలీది.
ప్రధాన కీవర్డ్స్ ను ఉపయోగించి సెర్చ్ చేశాం. వివిధ ప్రధాన మీడియా కథనాలను వెతికాం, అలాగే పోలీసు అమరవీరుల స్మారక దినోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగాన్ని ప్రత్యక్ష ప్రసారం చేసిన అనేక యూట్యూబ్ ఛానెల్ లు లభించాయి. ప్రసంగంలోని ముఖ్య అంశాలను ప్రచురించిన అనేక వార్తా నివేదికలు కూడా మాకు కనిపించాయి. కానీ ఏ వార్తా నివేదిక కూడా వైరల్ పోస్టుల్లోని కథనాలను నివేదించలేదు.
ప్రత్యక్ష ప్రసారం చేసిన కొన్ని వీడియోల లింక్స్ ఇక్కడ చూడొచ్చు.
తన ప్రసంగంలో, మావోయిస్టు నాయకులు పోలీసులకు లొంగిపోయి ప్రధాన స్రవంతి జీవితంలోకి రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో నక్సల్స్ ముప్పును రూపుమాపడంలో తెలంగాణ పోలీసులు చేసిన సేవను ఆయన ప్రశంసించారు. రాష్ట్రంలో ఉగ్రవాదం, నక్సల్స్ కార్యకలాపాలను తగ్గించడంలో తెలంగాణ పోలీసులు చేసిన నిస్వార్థమైన సేవను ఆయన ప్రశంసించారు. తెలంగాణకు చెందిన పలువురు పోలీసు అధికారులు విధి నిర్వహణలో ఉన్నప్పుడు తమ ప్రాణాలను త్యాగం చేశారని ఆయన గుర్తు చేశారు. సైబర్ నేరం, డిజిటల్ మోసం, మార్ఫింగ్ కంటెంట్, మాదకద్రవ్యాల సంబంధిత నేరాలు, మానవ అక్రమ రవాణా వంటి కొత్త సవాళ్లను ఆయన హైలైట్ చేశారు.
ఆయన ప్రసంగానికి సంబంధించిన పూర్తి వీడియోలు, కథనాలను చూశాక దేశంలోని ముస్లింలు లేదా ముస్లిం నాయకుల గురించి చేసిన ప్రకటన ఏమి ఆయన చేయలేదని తెలుస్తోంది.
తెలంగాణ ఫ్యాక్ట్ చెక్ డివిజన్ అధికారిక X హ్యాండిల్ వైరల్ పోస్ట్ను ఖండించింది. వార్తాపత్రిక క్లిప్పింగ్ కల్పితమని స్పష్టం చేసింది. "ముస్లింలు మంత్రి పదవులను నిర్వహించలేరని" చెప్పారని తప్పుడు వాదనతో నకిలీ వార్తాపత్రిక క్లిప్పింగ్ ప్రచారంలో ఉందని తెలిపింది. ఈ ప్రకటన పూర్తిగా కల్పితమని, ముఖ్యమంత్రి అలాంటి వ్యాఖ్యలు చేయలేదని వివరించింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సమయంలో, రాష్ట్రంలో శాంతి, సామరస్యాన్ని దెబ్బతీసేందుకు అనేక మతపరమైన తప్పుడు పోస్ట్లు వ్యాప్తి చెందుతున్నాయని పోస్టుల్లో తెలిపారు. సోషల్ మీడియాలో ఏమి షేర్ చేస్తున్నారో జాగ్రత్తగా ఉండాలని కోరారు. ఫార్వార్డ్ చేసే ముందు ధృవీకరించుకోవాలని, నకిలీ వార్తలకు మోసపోవద్దని సూచించారు.
కనుక, ముస్లింలు మంత్రి పదవులను నిర్వహించలేరని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారని పేర్కొంటూ ఒక వార్తాపత్రిక క్లిప్పింగ్ నకిలీది. అటువంటి నివేదికను ఏ వార్తా మీడియా సంస్థ ప్రచురించలేదు. వైరల్ అవుతున్న వాదన నిజం కాదు.

