అచ్చ “తెలుగు” వెంకయ్య
ముప్పవరపు వెంకయ్య నాయుడు… తెలుగు వారు గర్వించదగ్గ మూడో నాయకుడు. నీలం సంజీవరెడ్డి 1977లో రాష్ట్రపతిగా ఎన్నికై తెలుగువారి కీర్తి ప్రతిష్టలను చాటారు. ఏకగ్రీవంగా ఎన్నికలైన తొలి [more]
ముప్పవరపు వెంకయ్య నాయుడు… తెలుగు వారు గర్వించదగ్గ మూడో నాయకుడు. నీలం సంజీవరెడ్డి 1977లో రాష్ట్రపతిగా ఎన్నికై తెలుగువారి కీర్తి ప్రతిష్టలను చాటారు. ఏకగ్రీవంగా ఎన్నికలైన తొలి [more]
ముప్పవరపు వెంకయ్య నాయుడు… తెలుగు వారు గర్వించదగ్గ మూడో నాయకుడు. నీలం సంజీవరెడ్డి 1977లో రాష్ట్రపతిగా ఎన్నికై తెలుగువారి కీర్తి ప్రతిష్టలను చాటారు. ఏకగ్రీవంగా ఎన్నికలైన తొలి రాష్ట్రపతి ఆయనే కావడం విశేషం. పెద్దగా చదువుకోనప్పటికీ దేశ ప్రధమ పౌరుడు కాగలిగారు. ముఖ్యమంత్రి, లోక్ సభ స్పీకర్, ఏఐసీసీ అధ్యక్షుడు, కేంద్రమంత్రి పదవులను సమర్థవంతంగా నిర్వహించారు ఈ అనంతపురం జిల్లా నాయకుడు. పాములపర్తి వెంకట నరసింహారావు…సంక్షిప్తంగా పీవీగా ప్రసిద్ధుడై అత్యున్నతమైన ప్రధాని పీఠాన్ని అధిష్టించిన తొలి తెలుగు నాయకుడు. రాజీవ్ గాంధీ మరణానంతరం 1991లో ప్రధాని పదవి చేపట్టి దేశ ప్రగతిని మార్చిన ధీటైన నాయకుడు. కరీంనగర్ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగర గ్రామానికి చెందిన పీవీ రాష్ట్ర మంత్రిగా, ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా పనిచేసి కీలక పదవులకు వన్నె తెచ్చారు. మూడోతరం నేత ముప్పవరపు వెంకయ్య నాయుడు అదే కోవలోకి వస్తారు. ఎమ్మెల్యేగా, ఎంపీగా, కేంద్రమంత్రిగా, బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా సమర్థతను చాటుకున్న దేశంలో రెండో అత్యున్నత పదవి ఉపరాష్ట్రపతి పదవి చేపట్టారు. ఉప రాష్ట్రపతి హోదాలో రాజ్యసభ ఛైర్మన్ గా ముప్పవరపు వెంకయ్య నాయుడు పెద్దల సభను సమర్థంగా నిర్వహిస్తూ పేరు ప్రతిష్టలను పెంచారు.
ఆయన ప్రసంగాలతో…..
ముప్పవరపు వెంకయ్యనాయుడు గత నాలుగు దశాబ్దాలుగా తెలుగువారికి అత్యంత సుపరిచితుడు. ఆయన మాటల మాంత్రికుడు. తన ప్రసంగంతో సభికులను మంత్రముగ్దులను చేయగలరు. తెలుగు, హిందీ, ఆంగ్ల భాషలపై ఆయనకు మంచి పట్టుంది. యతి ప్రాసలతో ముప్పవరపు వెంకయ్యనాయుడు చేసే ప్రసంగాలు సభికులను కడుపుబ్బ నవ్విస్తుంది. ఉద్వేగపూరితంగా చేసే ప్రసంగం ఉర్రూత లూగిస్తుంది. ధారాళంగా సాగే ప్రసంగం గంగా ప్రవాహాన్ని తలపిస్తుంది. పదునైన విమర్శలతో చేసే ప్రసంగం రాజకీయ ప్రత్యర్తులకు నోట మాట పెగలనీయదు. ముప్పవరపు వెంకయ్యనాయుడి ప్రసంగం వినడానికి, ఆస్వాదించడానికి ఇప్పటికీ వివిధ రంగాల ప్రముఖులు బారులు కడుతుండటం విశేషం.
తెలుగుకు నిలువెత్తు….
తెల్లటి పంచెకట్టుతో తెలుగుదనానికి నిలువెత్తు ప్రతిరూపంగా నిలిచే ముప్పవరపు వెంకయ్యనాయుడు ఉప రాష్ట్రపతి పదవి చేపట్టి రెండేళ్లు పూర్తయ్యాయి. మహాత్మాగాంధీ మనవడు రాజమోహన్ గాంధీపై గెలిచిన వెంకయ్యనాయుడు 2017 ఆగస్టు 12న ఉపరాష్ట్రపతిగా బాధ్యతలను స్వీకరించారు. సాధారణంగా రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, గవర్నర్ పదవుల్లో పెద్దగా పని ఉండదు. ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు, అతిధి ప్రసంగాలు, స్మారకోపన్యాసాలు, పుస్తకావిష్కరణ వంటి కార్యక్రమాలకే పరిమితమవుతారు. ఎక్కువకాలం కార్యాలయంలోనే గడుపుతారు. కానీ ముప్పవరపు వెంకయ్యనాయుడు ఇందుకు పూర్తిగా భిన్నం. ఈ రెండేళ్ల కాలంలో పెద్దల సభను ప్రభావవంతంగా నడిపారు. అర్థవంతమైన చర్చలకు ఆస్కారం కల్పించారు. విపక్షాలకు మాట్లాడే అవకాశం ఇచ్చారు. కేవలం సభా కార్యక్రమాలకే పరిమితం కాకుండా దేశ వ్యాప్తంగా విస్తృతంగా పర్యటించారు. దేశవ్యాప్తంగా 61 విశ్వవిద్యాలయాల స్నాతకోత్సవాల్లో పాల్గొని విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. స్ఫూర్తిదాయకమైన ప్రసంగాలు చేశారు. 35 సార్లు విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 11 దేశాల అధ్యక్షులు, ఏడు దేశాల ఉపాథ్యక్షులు, 8మంది ప్రధానలతో సమావేశమై ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు.
19 దేశాల్లో పర్యటన…..
నాలుగు ఖండాల్లోని 19 దేశాల్లో ముప్పవరపు వెంకయ్యనాయుడు పర్యటించి ఆ యా దేశాలతో సత్సంబంధాలకు కృషి చేశారు. కోస్టారికాలో ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో నడుస్తున్న యూనివర్సిటీ ఆఫ్ పీస్ నుంచి గౌరవ డాక్టరేట్ ను ముప్పవరపు వెంకయ్యనాయుడు అందుకున్న తొలి భారతీయుడిగా రికార్డు సృష్టించారు. 1893లో చికాగోలో స్వామి వివేకానంద ప్రసంగం చేసిన చారిత్రక పుల్లెట్రాన్ హాలులో భారతీయ సమాజాన్ని ఉద్దేశించి ముప్పవరపు వెంకయ్యనాయుడు ప్రసంగించారు. 238 రోజుల పాటు రాజ్యసభ సభ కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించారు. ఉప రాష్ట్రపతి గా రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ముప్పవరపు వెంకయ్యనాయుడు ప్రత్యేకతలు, సాధించిన విజయాలపై ప్రచురించిన లిజనింగ్, లెర్నింగ్, లీడింగ్ అనే పుస్తకాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇటీవల చెన్నైలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పళనిస్వామి, గవర్నర్ భన్వర్ లాల్ పురోహిత్, కేంద్రమంత్రి ప్రకాష్ జవదేకర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముప్పవరపు వెంకయ్యనాయుడు మాట్లాడుతూ పదవీ విరమణ అనంతరం నానాజీ దేశ్ ముఖ్ బాటలో సామాజిక సేవలో పాల్గొంటనన్నారు. సమాజం పట్ల ఆయన చిత్తశుద్ధి, బాధ్యతకు ఆ వ్యాఖ్యలు నిదర్శనం. ముప్పవరపు వెంకయ్యనాయుడుకు తెలుగు రాష్ట్రాలంటే మహా ప్రీతి. తనకు వీలయినప్పుడల్లా రెండు రాష్ట్రాల్లో పర్యటిస్తుంటారు. తెలుగు భాషను విడిచి పెట్టవద్దంటూ ఆయన ప్రతి ప్రసంగంలో అంటుంటారు. తెలగుభాష దినోత్సవం సందర్భంగా వెంకయ్యనాయుడిపై “తెలుగు పోస్ట్” ప్రత్యేక కథనమిది.
– ఎడిటోరియల్ డెస్క్