జగన్ పక్కన పెట్టేసి…?
రాజకీయాల్లో విధేయులే కాదు.. వీర విధేయులు కూడా ఉంటారు. అధినేత ఏం చెప్పినా.. చేయడమే కాకుండా గుడ్డిగా అనుకరించడం వీరికి రాజకీయంగా అబ్బిన విద్య. అధినేత ఏం [more]
రాజకీయాల్లో విధేయులే కాదు.. వీర విధేయులు కూడా ఉంటారు. అధినేత ఏం చెప్పినా.. చేయడమే కాకుండా గుడ్డిగా అనుకరించడం వీరికి రాజకీయంగా అబ్బిన విద్య. అధినేత ఏం [more]

రాజకీయాల్లో విధేయులే కాదు.. వీర విధేయులు కూడా ఉంటారు. అధినేత ఏం చెప్పినా.. చేయడమే కాకుండా గుడ్డిగా అనుకరించడం వీరికి రాజకీయంగా అబ్బిన విద్య. అధినేత ఏం చేయమన్నా ఎలాంటి భేషజాలు, వెనుకాముందు కూడా ఆలోచించకుండా దూసుకుపోవడం వీరి నైజం. దీంతో ఇలాంటి నాయకులకు ఆయా అధినేతలు.. పార్టీల్లోనే కాకుండా ప్రభుత్వాల్లోనూ కీలక పదవులు ఇచ్చి గౌరవించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఇది ఏ ఒక్క పార్టీకో పరిమితం కాదు. రాజకీయాల్లో ప్రతి పార్టీలోనూ ఇలాంటి వీర విధేయులు ఉండడం, వారికి అధినేతలు రెడ్ కార్పెట్ పరవడం మామూలే.
పెద్ద జాబితానే ఉన్నా…..
ఇక, ప్రస్తుత ఏపీ అధికార పార్టీ వైసీపీలోనూ ఇలాంటి నాయకులకు కొదవలేదు. నగరి ఎమ్మెల్యే రోజా, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి, నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ఇలా చెప్పుకొంటూ పోతే.. ఈ జాబితాకు, జగన్ అంటే పడిచచ్చే నాయకులకు వైసీపీలో పెద్ద జాబితానే ఉంది. ఎన్ని కష్టాలు, ఎన్ని నష్టాలు వచ్చినా కూడా సదరు నేతలు జగన్ను, వైసీపీని కూడా విడిచి పెట్టకుండా ముందుకు సాగారు. ఈ క్రమంలోనే జగన్ తమకు మంచి ఫ్యూచర్ ఇస్తారని భావించిన ఆయన వెంటే ఉండిపోయారు.
ప్రభుత్వం కొలువు దీరడంతో….
ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం ఏపీలో కొలువు దీరింది. అయితే, ఇలాంటి అత్యంత వీర విధేయుల్లో కొందరికి మాత్రమే జగన్ పెద్ద పీట వేశారు. మరికొందరిని పక్కన పెట్టారు. నిజానికి తనకు సాయం చేసినప్రతి ఒక్కరికీ ఏదో ఒకటి చేయాలని జగన్ కు ఉన్నప్పటికీ.. సామాజిక సమీకరణలు, వివిధ నిబంధనలు వంటివి జగన్ ముందరి కాళ్లకు బంధాలను వేశాయి. దీంతో కొందరికి ఎలాంటి గుర్తింపూ లభించలేదు. ఇలాంటి వీర విధేయుల్లో ఒకరుగా చర్చకు వస్తున్నారు ముదునూరి ప్రసాదరాజు.
వైఎస్ హయాం నుంచే….
వైఎస్ కు వీరవిధేయుడుగా ప్రముఖంగా గుర్తింపు పొందిన ముదునూరి ప్రసాదరాజు.. 2004లో వైఎస్ టికెట్ ఇచ్చినా కొత్తపల్లి సుబ్బారాయుడి రాజకీయాల కారణంగా ఆయన ఓడిపోయాడు. అయితే, రెట్టించిన ఉత్సాహంతో 2009లో మరోసారి టికెట్ పొంది.. దాదాపు 20,000 ఓట్లతో తొలిసారి కొత్తపల్లిని ఘోరంగా ఓడించాడు. ఇక, ఆ తర్వాత కాలంలో వైఎస్ మరణంతో వైసీపీలోకి వెళ్లాడు. అయితే, 2012 జరిగిన ఉప పోరులో ఓడిపోయాడు. ఇక, తర్వాత జగన్ ఆదేశం మేరకు 2014లో ఆచంట నుంచి పోటీ చేశారు. అయితే, ఇక్కడ నుంచి టీడీపీ తరఫున పోటీ చేసిన పితాని సత్యనారాయణ విజయం సాధించారు.
నమ్మిన బంటుగా…..
అప్పటి వరకు నరసాపురంలో వర్క్ చేసుకున్న ముదునూరి ప్రసాదరాజు జగన్ సూచనల మేరకు తన సీటు త్యాగం చేసి ఆచంటలో పోటీకి దిగి రిస్క్ చేసి ఓడిపోయాడు. ఇక, తాజా ఎన్నికల్లో నరసాపురం నుంచి పోటీ చేసిన ముదునూరి ప్రసాదరాజు మంచి మెజారిటీతో విజయం సాధించారు. జగన్కు అత్యంత సన్నిహితుడుగానే కాకుండా వైఎస్ కుటుంబానికి నమ్మిన బంటుగా ఉన్న ముదునూరుకు జగన్ కేబినెట్లో సీటు ఖాయమని అనుకున్నారు. రాజుల కోటాలో మంత్రి పదవికి ఇస్తారని అనుకున్నా..అనూహ్యంగా చెరకువాడ రంగనాథ రాజుకు ఇచ్చారు. ఈ నేపథ్యంలో మరి నమ్మిన బంటును జగన్ ఏం చేస్తారు? రెండేళ్ల తర్వాత అయినా ఆయనకు మంత్రి పదవి వస్తుందా ? అనే ప్రశ్న ఇప్పుడు వైసీపీలో వినిపిస్తోంది.