ఆ ఎమ్మెల్యేకు జగన్ పిలుపు.. మంత్రి బెర్త్ ఖరారేనా..?
చిత్తూరు జిల్లా మదనపల్లె ఎమ్మెల్యే, మైనారిటీ నేత నవాజ్ బాషాకు వైసీపీ అధినేత, సీఎం జగన్ నుంచి పిలుపు వచ్చిందా ? ఆయనకు మంత్రి పదవి ఇవ్వాలని [more]
చిత్తూరు జిల్లా మదనపల్లె ఎమ్మెల్యే, మైనారిటీ నేత నవాజ్ బాషాకు వైసీపీ అధినేత, సీఎం జగన్ నుంచి పిలుపు వచ్చిందా ? ఆయనకు మంత్రి పదవి ఇవ్వాలని [more]
చిత్తూరు జిల్లా మదనపల్లె ఎమ్మెల్యే, మైనారిటీ నేత నవాజ్ బాషాకు వైసీపీ అధినేత, సీఎం జగన్ నుంచి పిలుపు వచ్చిందా ? ఆయనకు మంత్రి పదవి ఇవ్వాలని జగన్ నిర్ణయించారా ? అంటే.. తాడేపల్లి వర్గాలు సహా మదనపల్లెకు చెందిన నాయకులు కూడా ఔననే అంటున్నారు. ఇదే విషయంపై నవాజ్.. మౌనంగా ఉన్నప్పటికీ.. నియోజకవర్గంలో మాత్రం ఒకింత సందడి నెలకొంది. గత ఏడాది ఎన్నికల్లో మదనపల్లె నుంచి పోటీ చేసిన నవాజ్.. 27 వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. మైనారిటీ వర్గాల్లోనూ మంచి పేరు సంపాయించుకున్నారు.
బలమైన సిఫార్సుతోనే…..
వాస్తవానికి ఆయనకు బలమైన రికమెండేషన్ల వల్లే ఎమ్మెల్యే సీటు వచ్చిందన్నది వాస్తవం. వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న దేశాయి తిప్పారెడ్డిని కాదని జగన్ నవాజ్కు సీటు ఇచ్చారు. పార్టీ ఆవిర్భావం నుంచి వైసీపీలో ఉండడంతో పాటు ఎమ్మెల్సీ, 2014లో ఎమ్మెల్యేగా గెలిచిన తిప్పారెడ్డినే పక్కన పెట్టారంటే నవాజ్కు జగన్కు ఉన్న బలమైన లింక్ ఏంటో తెలుస్తోంది. ఇక ఇప్పుడు మైనార్టీ కోటాలో ఆయనకు మంత్రి పదవి ఇస్తారంటూ.. కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారంలో నిజమెంతో కూడా తెలియదని కొందరు అంటుండగా.. మరికొందరు మాత్రం నిజమేనని అంటున్నారు.
ఆయన స్థానంలో…..
ఈ వార్తలతో మదనపల్లె రాజకీయాలు ఊపందుకున్నాయి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వర్గంగా నవాజ్కు మంచిపేరుంది. వివాద రహితుడు, పైగా పెద్దిరెడ్డి కనుసన్నల్లోనే ఆయన చక్రం తిప్పుతున్నా రు. ప్రస్తుతం మైనారిటీ, డిప్యూటీ సీఎంగా ఉన్న అంజాద్ బాషాపై వివాదాలు లేకపోయినప్పటికీ.. ఆయన దూకుడు లేని నాయకుడిగా విమర్శలు ఎదుర్కొంటున్నారు. సొంత పార్టీ నాయకులు కూడా ఆయనను వ్యతిరేకిస్తున్నారని ఇటీవల కాలంలో వార్తలు వస్తున్నాయి. కడప జిల్లాలో మైనారిటీ వర్గాన్ని వైసీపీ వైపు తిప్పుకోవడంలోనూ ఆయన ఉదాసీనంగా ఉన్నారని చెబుతున్నారు.
ఈయన లక్ ఎలా ఉందో..?
ప్రస్తుతం ఇప్పటికిప్పుడు మంత్రి వర్గ మార్పు లేకపోయినా.. త్వరలో జరిగే మంత్రి వర్గం విస్తరణలో మాత్రం ఖచ్చితంగా ఆయనను మారుస్తారని అంటున్నారు. ఈ మార్పుల్లో కడప జిల్లా నుంచి రెడ్డి వర్గానికి చెందిన ఎమ్మెల్యేను జగన్ కేబినెట్ లోకి తీసుకుంటారని.. మైనార్టీ కోటాలో బెర్త్ పెద్దిరెడ్డి వర్గంగా ఉన్న నవాజ్కు అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉందని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ప్రచారంలో నిజానిజాలు ఇంకా బయటకు రావాల్సి ఉంది. కానీ, ఇప్పుడు మాత్రం సీఎం జగన్ పిలిచారని, మంత్రి పదవి ఇవ్వనున్నారన్న టాక్ వైసీపీ వర్గాల్లోనే ఎక్కువుగా వినిపిస్తోంది. మరి నవాజ్ లక్ ఎలా ఉందో ?