వీటిని మర్చిపోగలమా?
రాజకీయాలు ఎప్పుడూ ఒకేలా ఉండవు. ఏటికేడు మారుతూనే ఉంటాయి. ఐదేళ్ల కోసారి జరిగే ఎన్నికలతో ప్రభుత్వాలు మారినా.. రాజకీయాల్లో మాత్రం ప్రతి వార్షికంలోనూ కొత్త పొద్దులు కనిపిస్తూనే [more]
రాజకీయాలు ఎప్పుడూ ఒకేలా ఉండవు. ఏటికేడు మారుతూనే ఉంటాయి. ఐదేళ్ల కోసారి జరిగే ఎన్నికలతో ప్రభుత్వాలు మారినా.. రాజకీయాల్లో మాత్రం ప్రతి వార్షికంలోనూ కొత్త పొద్దులు కనిపిస్తూనే [more]
రాజకీయాలు ఎప్పుడూ ఒకేలా ఉండవు. ఏటికేడు మారుతూనే ఉంటాయి. ఐదేళ్ల కోసారి జరిగే ఎన్నికలతో ప్రభుత్వాలు మారినా.. రాజకీయాల్లో మాత్రం ప్రతి వార్షికంలోనూ కొత్త పొద్దులు కనిపిస్తూనే ఉంటాయి. అలానే ఏపీలోనూ 2019లో అనేక రాజకీయ రసవత్తర ఘట్టాలు ఆవిష్కృత మయ్యాయి. ప్రజల తీర్పు నేపథ్యంలో నేతలకు చురుక్కులు-చెమక్కులు బాగానే తగిలాయి. ఒక్కపార్టీ నే కాదు.. రాష్ట్రంలోని అన్ని పార్టీలకూ ప్రజల తీర్పు ఓ గుణ పాఠమే కాదు.. అద్భుత అనుభవాల పోపుల పెట్టెనే మిగిల్చింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో జరిగిన రాజకీయ పరిణామాల్లో కీలకమైన రసగుళికలను ఒకసారి నెమరు వేసుకుందాం.. కొత్త సంవత్సర సంరంభంలో రాజకీయ పార్టీల పునర్వయిభవానికి ఆహ్వానం పలుకుదాం..
+ దాదాపు 3 వేల పైచిలుకు కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్రను ప్రతిష్టాత్మకంగా భుజాన వేసుకున్న వైసీపీ అధినేత జగన్.. తన పాదయాత్రను ఈ ఏడాదే పూర్తి చేశారు.
+ ఈ ఏడాది దేశంలో సార్వత్రిక ఎన్నికలతోపాటు ఏప్రిల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి.
+ గత సప్రదాయానికి భిన్నంగా టీడీపీ అధినేత, అప్పటి సీఎం చంద్రబాబు ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోకుండా ఒంటరిగా ఎన్నికలకు వెళ్లారు.
+ పక్కావ్యూహంతో అప్పటి అధికార పార్టీ టీడీపీ మహిళలకు ఎన్నికల సమయంలోనూ పసుపు-కుంకుమ, రైతులకు అన్నదాత సుఖీభవ కింద నిధులు విడుదల చేసింది.దీనిని కోర్టులు కూడా సమర్ధించడం రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
+ ఎన్నికల ఫలితాలు వచ్చేందుకు దాదాపు 42 రోజుల సుదీర్ఘ ఎదురు చూపులు ప్రజలకు, నరాలు తెగే ఉత్కంఠ రాజకీయ పార్టీలకు తప్పని సరి పరిస్థితిని కల్పించింది ఈ ఏడాదే.
+ ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తొలిసారి ఎన్నికల్లో పోటీ చేశారు. వాస్తవానికి 2014 ఎన్నికలకు ముందుగానే పార్టీ పెట్టినా. అప్పట్లో పోటీకి దూరంగా ఉన్నారు.
+ పవన్ కళ్యాణ్ ఏకంగా రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేసి పరాజయం చవిచూశారు. మెగా బ్రదర్ సొంత జిల్లా పశ్చిమ గోదావరిలో నాగబాబు, సోదరుడు పవన్లు ఇద్దరూ ఓటమి పాలయింది కూడా ఈ ఏడాదే.
+ రాష్ట్రంలో అధికారంలోకి వస్తామని బీరాలు పలికిన బీజేపీ నాయకులు ఉన్న నాలుగు సీట్లలోనూ విజయం సాధించలేక పోయారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ నరసరావుపేట ఎంపీ స్థానం నుంచి పోటీ చేసి తొలిసారి తన రాజకీయ జీవితంలో డిపాజిట్లు కోల్పోయారు.
+ టీడీపీ అధినేత చంద్రబాబు తన సొంత నియోజకవర్గం కుప్పంలో గత ఎన్నికల కన్నా తక్కువ మెజారిటీతో విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో 47 వేల పైచిలుకు ఓట్ల మెజారిటీ రాగా, ఈ ఏడాది అనూహ్యంగా ఇది 30వేలకు తగ్గిపోయింది.
+ చంద్రబాబు కుమారుడు, అప్పటి మంత్రి లోకేష్ మంగళగిరి నుంచి పోటీ చేసి ఘోరంగా ఓడిపోయారు. ఇక్కడ ఆయన సతీమణి, తల్లి కూడా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఒకసారి సొంత మామ బాలకృష్ణ కూడాప్రచారానికి వచ్చారు. అయినా కూడా లోకేష్ను విజయం వరించలేదు.
+ కానిస్టేబుల్ కొడుకు సీఎం కాకూడదా?! అంటూ జనసేనాని పవన్ రగిలించాలని అనుకున్న సెంటిమెంట్ ఆదిలోనే కొడిగట్టింది.
+ పాదయాత్ర సహా చంద్రబాబు ఆకర్ష్ దెబ్బతో వైసీపీ పై ఏర్పడిన సానుకూల పవనాలు.. జగన్ కు అప్రతిహత విజయాన్ని దక్కించాయి. ఎవరూ కలలో కూడా ఊహించని విధంగా 151 మంది ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీలతో ఆయన పార్టీ విజయం సాధించి అధికారంలోకి వచ్చింది.
+ వ్యక్తిగత కారణాలు, కేసులు, పార్టీ నుంచి మద్దతు కొరవడిన నేపథ్యంలో అసెంబ్లీ మాజీ స్పీకర్, ఏపీ అసెంబ్లీ తొలి స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇది దేశంలోనే తొలి ఘటనగా నమోదైంది.
+ చిత్తూరు మాజీ ఎంపీ, టీడీపీ సీనియర్ నాయకుడు, నటుడు శివప్రసాద్ ఈ ఏడాది అనారోగ్య కారణాలతో మృతి చెందారు.
+ టీడీపీలో చంద్రబాబుకు నమ్మినబంటుగా ఉన్న కృష్ణాజిల్లా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఆ పార్టీకి రిజైన్ చేశారు.
+ ఏపీ ప్రజల చిరకాల కోరిక ప్రత్యేక హోదా అంశం ఎక్కడి గొంగళి అక్కడే అన్న చందంగా మారిపోయింది.
+ పోలవరం సహా వివిధ ప్రాజెక్టులపై జగన్ సర్కారు తీసుకువచ్చిన రివర్స్ టెండర్లు దేశవ్యాప్తంగా చర్చకు వచ్చాయి.
+ హైదరాబాద్ దిశ ఘటన నేపథ్యంలో రాష్ట్రంలో మహిళలకు రక్షణ కల్పిస్తూ.. జగన్ ప్రభుత్వ ఏపీ దిశ-2019 చట్టాన్ని తీసుకువచ్చింది. దేశంలో మహిళల రక్షణకు ఇప్పటి వరకు ఏ రాష్ట్రం కూడా ఇలాంటి చట్టం చేయకపోవడం గమనార్హం. కేవలం కేంద్రం చేసిన నిర్భయ చట్టమే ఇప్పటి వరకు ఉంది.
+ తన కేబినెట్లో ఐదుగురు డిప్యూటీ సీఎంలను నియమించడం ద్వారా జగన్ ఈ ఏటి మేటి సీఎంగా దేశంలో గుర్తింపు తెచ్చుకున్నారు.
+ ఏపీ హిస్టరీలో ఓ ఎస్సీ మహిళకు హోం శాఖ పగ్గాలు అప్పగించి సీఎం జగన్ మరో రికార్డును సొంతం చేసుకున్నారు.
+ ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్లను విడదీసి ప్రత్యేక కార్పొరేషన్లుగా ఏర్పాటు చేయడంతోపాటు నిధులు కూడా కేటాయించడం దేశంలోనే ప్రప్రథమం.
+ మైనార్టీ వర్గానికి చెందిన నాయకుడు అంజాద్ బాషాకు, గిరిజన నాయకురాలు పుష్ప శ్రీవాణికి డిప్యూటీ సీఎం పదవులు లభించాయి.
+ ఎంతటి అధికారులైనా హద్దు మీరితే.. ప్రభుత్వం చూస్తూ ఊరుకోదనే సంకేతాలను పంపుతూ.. సీఎం జగన్ అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యాన్ని రాత్రికి రాత్రి బదిలీ చేసి సంచలనం సృష్టించారు. ఇది రాజకీయంగానే కాకుండా అధికారుల్లోనూ సంచలనంగా మారింది.
+ తీవ్రమైన ఇసుక కొరత కారణంగా దాదాపు నాలుగు నెలల పాటు రాష్ట్రంలో కార్మికులు ఉద్యమాలకు దిగారు. ఇది జగన్ ప్రభుత్వంలో జరిగిన తొలి ఆందోళనగా రికార్డులకు ఎక్కింది.
+ పోలీసులకు వీక్లీ ఆఫ్ ఇస్తూ.. నిర్ణయం తీసుకున్న తొలి రాష్ట్రంగా రికార్డు సృష్టించారు.
+ నిత్యం వైరంతో అట్టుడుకిన తెలంగాణతో స్నేహ హస్తం చాచిన తొలి సీఎంగా జగన్ నిలిచారు. దీనికి ఇరు రాష్ట్రాల్లోనూ హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి.
+ టీడీపీ అదినేత చంద్రబాబు సామర్ధ్యంపై ఒకానొక దశలో రాష్ట్రంలో తీవ్ర చర్చ జరిగింది.
+ రాజధాని అమరావతి స్థానంలో మరో రెండు రాజధానుల ప్రతిపాదన తీసుకురావడం రాష్ట్ర ప్రభుత్వం గడిచిన ఆరు మాసాల్లో తీసుకున్న ముఖ్యంగా ఈ ఏడాది చివరిలో తీసుకున్న కీలకనిర్ణయంగా చెప్పాలి.
+ పార్టీలు మారే వారికి సభ్యత్వం రద్దు చేస్తామంటూ(వేటు).. అసెంబ్లీలో సాక్షాత్తూ సీఎం జగన్ ప్రకటించడం సంచలనంగా మారింది.
+ ఈ యేడాది జరిగిన ఎన్నికల్లో వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చి పోటీ చేసిన వారందరిని జనాలు చిత్తు చిత్తుగా ఓడించారు. ఒక్క అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ మాత్రమే విజయం సాధించారు.
+ రైతు భరోసా, అమ్మ ఒడి, మద్యం దశలవారీ నిషేధం, వైఎస్సార్ వాహన మిత్ర, నేతన్న నేస్తం, నాడు-నేడు,ప్రభుత్వ స్కూళ్లలో ఆంగ్ల మాధ్యమం, అన్ని నామినేటెడ్ పోస్టుల్లోనూ 50శాతం మహిళలకు అవకాశం కల్పించడం, దేవాలయ బోర్డుల్లోనూ రిజర్వేషన్ పాటించడం వంటివి కీలక నిర్ణయాలుగా 2019 ఏపీకి అందించిందనే చెప్పాలి.