చంద్రబాబును ఆ జిల్లా భయపెడుతోందా..?
చిత్తూరు జిల్లా... ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు సొంత జిల్లా. ఈ జిల్లాలోని కుప్పం నియోజకవర్గం నుంచి ఆయన దాదాపు మూడు దశాబ్దాలుగా అసెంబ్లీకి విజయం సాధిస్తున్నారు. 1989 నుంచి 2014 ఎన్నికల వరకు వరుసగా ఆరుసార్లు విజయం సాధిస్తున్నారు. అయినప్పటికీ.. జిల్లా మొత్తంగా ఆయనకు పట్టు ఎంత? అని ప్రశ్నిస్తే.. మాత్రం సమాధానం లభించడం లేదు. గత ఎన్నికల్లోనే కాకుండా అంతకు ముందు జరిగిన ఎన్నికల్లోనూ కాంగ్రెస్, వైఎస్సార్ కాంగ్రెస్ ఇక్కడ దుమ్ము దులుపుతోంది. 1999 నుంచి ఇక్కడ గత రెండు దశాబ్దాల్లో టీడీపీ పట్టు సాధించలేకపోయింది.
జగన్ పాదయాత్రతో ఆందోళన...
ఇక పదేళ్ల తర్వాత పార్టీ అధికారంలోకి వచ్చినా జిల్లాలో చాలా మందికి పదవులు ఇచ్చినా కూడా చంద్రబాబు సొంత జిల్లాలో పార్టీ బలపడలేదంటే ఇక్కడ టీడీపీ పరిస్థితి స్పష్టమవుతోంది. ఇటీవల వైసీపీ అధినేత జగన్ నిర్వహించిన ప్రజాసంకల్ప పాదయాత్రకు సైతం ఇక్కడ ప్రజలు బ్రహ్మరథం పట్టారు. జగన్కు జేజేలు పలికారు. తన సొంత జిల్లాలో జగన్ పాదయాత్రకు అంచనాలకు మించిన స్పందన రావడంతో అప్పటి నుంచి కూడా చంద్రబాబుకు ఇక్కడి రాజకీయాలపై కాస్త టెన్షన్ స్టార్ట్ అయినట్టే కనపడుతోంది. ఇక్కడ వచ్చే ఎన్నికల్లో అయినా పూర్తిస్థాయిలో సైకిల్ తిరగాలని ఆయన ప్లాన్ చేసుకున్నారు. అయితే, క్షేత్రస్థాయిలో నేతలు ఎంతవరకు బాబుకు కలిసి వస్తున్నారు? అనేదే ఇప్పడు ప్రధాన ప్రశ్నగా మారిపోయింది.
నాయకులకు బాబు మార్క్ క్లాస్...
విషయంలోకి వెళ్తే.. ఈ జిల్లాలోని తంబళ్లపల్లె, మదనపల్లె, పుంగనూరు, పీలేరు నియోజకవర్గాల్లో పార్టీని పరుగులు పెట్టించాలని చంద్రబాబు డిసైడ్ అయ్యారు. దీనికి కారణం.. నగరి, చంద్రగిరి వంటి చోట్ల వైసీపీ హవాకు తిరుగులేదని రిపోర్టు రావడమే. అయితే పైన చెప్పుకున్న నాలుగు నియోజకవర్గాల్లోనూ పార్టీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారిందని తెలియడంతో ఇప్పుడు ఏం చేయాలో తెలియక ఆయన తల పట్టుకుంటున్నారు. ఇటీవల ఇదే విషయమై.. నియోజకవర్గం నేతలతో బాబు అమరావతిలోనే సిట్టింగ్ వేసేశారు. నాయకులకు క్లాస్ కూడా పీకారు. తంబళ్లపల్లె నియోజకవర్గంలో సొంత పార్టీ ఎమ్మెల్యే శంకర్ ప్రజలకు అందుబాటులో ఉండటం లేదన్న సర్వే ఫలితంపై బాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇలాగైతే వచ్చే ఎన్నికల్లో కనుమరుగవడం ఖాయమని ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది.
సర్వే వివరాలు చేతిలో పట్టుకుని...
మదనపల్లె నియోజకవర్గ ఇన్చార్జ్ పదవి కోసం వెళ్లిన నాయకులకు చుక్కెదురైంది. నాయకత్వానికి సంబంధించి ఎలాంటి ప్రకటనా చేయకున్నా నాయకులను మాత్రం గట్టిగానే మందలించినట్లు సమాచారం. సీఎం సహాయనిధి చెక్కులతో లక్షలాది రూపాయలు పంపిణీ చేసి ప్రజలందరి హృదయాల్లో నిలిచిపోయామని చెప్పుకున్న బొమ్మనచెరువు శ్రీరాముల్ని ‘నీ జాతకం మొత్తం నా వద్ద ఉంది. ఆ చెక్కులు దుర్విని యోగం జరిగిందన్న సమాచారం తనవద్ద ఉంది’ అని చెప్పడంతో శ్రీరాములు షాక్కు గురైనట్లు తెలిసింది. మాజీ ఎమ్మెల్యే రాచకొండ శోభ భర్త బాబురెడ్డి తీరుపైనా సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికారులు మాట వినడం లేదనే సాకుతో ఇంట్లో కూర్చుంటే సరిపోదని హెచ్చరించినట్లు టీడీపీ శ్రేణులు వెల్లడించాయి.
ఇలా అయితే కష్టమేనా...
పీలేరు, పుంగనూరు నియోజకవర్గాల్లో పార్టీ పటిష్టానికి కృషి చేయాలని, సమన్వయంతో పనిచేస్తే తప్ప గెలుపు అవకాశాలు లేవని తేల్చిచెప్పారు. ప్రతి నియోజకవర్గంలో ఐదుగురు సభ్యులతో కమిటీ వేసుకోవాలని సూచించారు. అయితే, నాయకులు మాత్రం ఇలాంటివి మామూలేనని లైట్గా తీసుకోవడం గమనార్హం. దీంతో చిత్తూరులోని ఆ నియోజకవర్గాలు బాబును తీవ్రస్థాయిలో భయపెడుతున్నాయని అంటున్నారు పరిశీలకులు. ఓవరాల్గా చూస్తే జిల్లాలో ఇప్పటకీ మెజార్టీ నియోజకవర్గాలతో పాటు తిరుపతి ఎంపీ సీటును టీడీపీ గెలుచుకునే పరిస్థితి లేదన్నది ఇంటిలిజెన్స్ సర్వేలతో పాటు తాజా రిపోర్టులు చెపుతున్నాయి. మరి రాబోయే రోజుల్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి.