రాజకీయ మత్తు దిగకపోతే… అంతే మరి?
మద్యపాన నిషేధం అన్నది మహాత్ముడి కల. ఈ దేశంలో ఆ రోజు రావాలని బాపూజీ కోరుకున్నారు, ఆ దిశగా దేశం ఉండాలని ఆశించారు. కానీ ఆయన స్వాతంత్ర్యం [more]
మద్యపాన నిషేధం అన్నది మహాత్ముడి కల. ఈ దేశంలో ఆ రోజు రావాలని బాపూజీ కోరుకున్నారు, ఆ దిశగా దేశం ఉండాలని ఆశించారు. కానీ ఆయన స్వాతంత్ర్యం [more]
మద్యపాన నిషేధం అన్నది మహాత్ముడి కల. ఈ దేశంలో ఆ రోజు రావాలని బాపూజీ కోరుకున్నారు, ఆ దిశగా దేశం ఉండాలని ఆశించారు. కానీ ఆయన స్వాతంత్ర్యం తెచ్చిన దేశంలో మద్య నిషేధం అన్న మాట గడచిన డెబ్బై మూడేళ్ల కాలంలో ఎక్కడా వినిపించడంలేదు. అంతే కాదు, ఎటు చూసినా మద్యం ఏరులై పారుతోంది. అది అతి పెద్ద ఆదాయవనరుగా పాలకులు మార్చేసుకున్నారు. ఆ మత్తు నుంచి వారు దిగరు. దాంతో దేశం తాగుబోతుల రాజ్యమవుతోంది. ఇక ఉన్నంతలో కొన్ని రాష్ట్రాలు మద్యపాన నిషేధం అమలు చేద్దామనుకున్నా కుటిల రాజకీయాలు వారికి ఆ అవకాశం ఇవ్వడంలేదు. ఇక దేశంలో ఇపుడు బీహార్ లో నితీష్ కుమార్ మద్యపాన నిషేధం అమలుచేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో వైఎస్సార్ పార్టీ అధికారంలోకి వచ్చింది. దశలవారీగా మద్యపాన నిషేధం అమలుచేస్తామని చెప్పిన వైసీపీ ఆ దిశగా అడుగులు వేస్తోంది.
దానికీ వెన్నుపోటు….
ఇక ఏపీలో తెలుగుదేశం పార్టీ ఉంది. ఆ పార్టీ అధినాయకుడు ఎన్టీఆర్ మద్యపాన నిషేధానికే కట్టుబడి ఉన్నారు. ఆయన 1994 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చినపుడు అమలు చేసి చూపారు. ఆయన కేవలం 8 నెలలు మాత్రమే అధికారంలో ఉన్నారు. ఆయన్ని దించేసి అధికారంలోకి వచ్చిన అల్లుడు చంద్రబాబు మాత్రం తాను మామ కంటే ఘనుడిని అని చెబుతూ హెల్త్ పర్మిట్లు కూడా అప్పట్లో రద్దు చేశారు. దాంతో చంద్రబాబు సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేస్తారని అంతా అనుకున్నారు. ఆ తరువాత నాటు సారా, అక్రమ మద్యం ఏపీలోకి వచ్చిందని కుంటి సాకులు చెప్పి మద్యపాన నిషేధాన్ని మొత్తానికే చంద్రబాబు ఎత్తేశారు. ఇక మద్యం ద్వారా వేల కోట్లు ఖజానాకు పిండుకోవచ్చునని ఆచరణలో నిరూపించిన సీఎంగా చంద్రబాబుని చెప్పుకోవాలి. అంతవరకూ అది ఆదాయవనరుగా భావించని వారందరికీ చంద్రబాబు ఓ దారి చూపారు.
ఏం కావాలో…?
ఇక ఏపీలో జగన్ 33 శాతం మందు దుకాణాలను తగ్గించారు. మిగిలిన వాటిలో అమ్మే మద్యానికి రేట్లు పెంచారు. మందు తాగాలంటే ముందు రేటు చూసి షాక్ కొట్టాలి. అందువల్ల మద్యం సామాన్యుడుకి దరి చేరనీయను అని జగన్ పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు ఏపీలో దశలవారీగా అమలు చేస్తున్నారు. రేట్లు కూడా భారీగా పెంచారు. మరి దీని మీద కూడా చంద్రబాబు ఆడిపోసుకుంటున్నారు. మద్యం రేట్లు ఎందుకు పెంచుతారు. అసలు ఆ హక్కు మీకు ఎవరు ఇచ్చారు అంటూ అర్ధం పర్ధం లేని విమర్శలు చేస్తున్నారు. పైగా నాసి రకం మద్యాన్ని అందిస్తున్నారని, మంచి బ్రాండ్లు లేకుండా చేశారంటూ మందు బాబుల తరఫున మాట్లాడుతున్నారు. అసలు చంద్రబాబుకు ఏం కావాలి. మద్య పాన నిషేధం మీద ఆ పార్టీ విధానం ఏంటి. ఏదో జగన్ మీద బురద జల్లాలని చూడడమేనా, కాకపోతే అతి కీలకమైన మధ్యపానం విషయంలో సుదీర్ఘ అనుభవం ఉన్న నేతగా, బలమైన తెలుగుదేశం పార్టీ అధినేతగా చంద్రబాబు ఒక విధానానికి కట్టుబడాల్సిన అవసరం లేదా అన్న ప్రశ్నలు వస్తున్నాయి.
ఇబ్బందులు పడాలా?
చంద్రబాబు చేస్తున్న విమర్శలు ఇపుడు ఎవరూ కూడా సీరియస్ గా పట్టించుకునే పరిస్థితిలో లేకపోవడానికి ఆయనే కారణం. ఎందుకంటే చంద్రబాబు పూర్తిగా అసూయ, అక్కసులో విమర్శలు చేస్తున్నారని తెలిసిపోతోంది. ఏపీ ఆర్ధిక పరిస్థితి బాబుకు బాగా తెలుసు. పులి మీద పుట్రలా కరోనా వైరస్ వచ్చి మొత్తం లేకుండా చేసింది. ఇంకో వైపు కేంద్ర సాయం ఏ విధంగా ఉంటుంది అన్నది కూడా చంద్రబాబుకు ఎరుకే. ఈ క్రమంలో జగన్ తాను మాట తప్పకుండా దశలవారీగా అని ముందే చెప్పినట్లుగా మద్య నిషేధం అమలు చేస్తున్నారు. ఒక్కసారి మద్య నిషేధం అమలు చేస్తే వచ్చే ఇబ్బందులు కూడా చూసుకోవాలి. అందుకే 2024 వరకూ గడువు పెట్టుకున్నారు. మరి చంద్రబాబుకు ఇందులో వచ్చిన సమస్య ఏంటో అర్ధం కావడంలేదు అంటున్నారు వైసీపీ నేతలు. మొత్తానికి మొత్తం నిషేధం విధించి ఏపీలో చిల్లి గవ్వ లేకుండా ఖజానా కుదేల్ కావాలన్నదేనా చంద్రబాబు ఆలోచన అని కూడా ప్రశ్నిస్తున్నారు. తెలంగాణాలో మద్యం ధరలు పెంచారు. పైగా ఇబ్బడి ముబ్బడిగా అమ్మకాలు చేస్తున్నారు. జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు ఆ వైపు చూడరు, మాట్లాడరు, ఏపీ మీదనే ఆయన దాడి చేస్తున్నారు అంటే జగన్ మీద కక్ష తప్ప మరేమీ కాదని వైసీపీ నేతలు అంటున్నారు. ఇలాంటి రాజకీయాలు చేస్తే జనం ఆదరించరన్న సంగతి చంద్రబాబుకు తెలియదా మరి.