డాక్టర్ ఎంపీగారు……జనం నాడి పట్టుకోలేకపోతున్నారా?
ఆమె వృత్తి రిత్యా మంచి వైద్యురాలు. నాడి చూసి జబ్బు ఏంటో చెప్పేయగల సమర్ధురాలు. పైగా సామాజిక సేవా కార్యక్రమాలు తన శక్తికొద్దీ చేస్తూ విశాఖ రూరల్ [more]
ఆమె వృత్తి రిత్యా మంచి వైద్యురాలు. నాడి చూసి జబ్బు ఏంటో చెప్పేయగల సమర్ధురాలు. పైగా సామాజిక సేవా కార్యక్రమాలు తన శక్తికొద్దీ చేస్తూ విశాఖ రూరల్ [more]
ఆమె వృత్తి రిత్యా మంచి వైద్యురాలు. నాడి చూసి జబ్బు ఏంటో చెప్పేయగల సమర్ధురాలు. పైగా సామాజిక సేవా కార్యక్రమాలు తన శక్తికొద్దీ చేస్తూ విశాఖ రూరల్ జిల్లాలో మంచి పేరు తెచ్చుకున్నారు. తొలుత కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆమెకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదు. చివరి నిముషంలో వైసీపీలో చేరి వెంటనే అనకాపల్లి ఎంపీ టికెట్ సాధించారు. అదే ఊపున ఆమె బంపర్ మెజారిటీతో గెలిచి ఎంపీగా తొలి ఏడాది త్వరలోనే పూర్తి చేసుకోబోతున్నారు. ఆమె అనకాపల్లి ఎంపీ సత్యవతి. మంచి మనిషిగా పేరున్న ఆమె మంచి నాయకురాలిగా ఎంతవరకూ పేరు తెచ్చుకున్నారన్నది కూడా ముఖ్యమే కదా.
గొంతు విప్పలేరా…?
ఆమె వైద్యురాలు, సుదీర్ఘ అనుభవం ఉంది. జనాల్లో ఉండడం, మాట్లాడడం వంటివి ఎవరూ చెప్పనక్కరలేదు. కానీ ఆమె పార్లమెంటులో మాత్రం తన వాణిని ఇంతవరకూ వినిపించలేదన్న బాధ మాత్రం ఎన్నుకున్న జనాలకు ఉంది. విశాఖ రూరల్ జిల్లా మొత్తానికి ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అనేక సమస్యలు ఉన్నాయి. అదే విధంగా దేశంలోకెల్లా అతి పెద్ద బెల్లం మార్కెట్ అనకాపల్లిలో ఉంది. చెరకు ప్రధాన పంటగా ఉన్న రూరల్ జిల్లాలో రైతాంగం సమస్యలు చాలానే ఉన్నాయి. మరి వీటి విషయంలోనైనా ఆమె పార్లమెంట్ లో గొంతు విప్పారా అంటే ఆశాభంగమే అంటున్నారు.
అవగాహన లేమి….
జిల్లాలో సమస్యలపైన అవగాహన లేమి ఆమెకు ఉన్నట్లుగా ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నారు. అది కొంతవరకూ నిజమేననుకోవాలేమో. పూర్తిగా కొత్త రంగం రాజకీయం. పైగా ఎకాఎకిన ప్రజా ప్రతినిధిగా ఎన్నిక కావడం, పెద్ద పార్లమెంట్ నియోజకవర్గానికి బాధ్యతలు ఓ విధంగా పెద్ద సవాలే. అయితే ఎవరూ ఇక్కడ మొదటి నుంచి గురువులు కారు. అంతా నేర్చుకుని ముందుకు వచ్చినవారే. ఆ విధంగా చూసుకున్నపుడు ఎంపీ సత్యవతి ఎంతవరకు అవగాహన పెంచుకున్నారన్నది చూసినా కూడా సొంత పార్టీలోనే అసంతృప్తి ఉన్నట్లుగా అర్ధమవుతోంది. ఆమె పూర్తిగా జనంలోకి వెళ్ళలేకపోతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.
పట్టు దొరకలేదే…?
సత్యవతి కేవలం వారం పది రోజులు మాత్రమే పని చేసి ఎంపీ అయిపోయారు. నాడు జగన్ ప్రభంజనం విపరీతంగా ఉంది. దాంతో ఎవరు మన ఎంపీ అభ్యర్ధి అన్నది కూడా ఎవరూ చూడకుండానే ఓటేశారు. మరి గెలిచిన తరువాత అయినా మొత్తం నియోజకవర్గం తిరగాలి కదా. అదే విధంగా పార్టీలో పదేళ్ళుగా పనిచేస్తున్న కార్యకర్తలను పట్టించుకోవాలిగా. వారికి వెన్ను దన్నుగా నిలవాలిగా. పార్టీ పటిష్టతకు చర్యలు తీసుకోవాలి, అలాగే జనంతో మమేకం కావాలి. సమస్యలు క్షేత్ర స్థాయిలో తెలుసుకుని ఢిల్లీ లెవెల్లో ప్రస్తావించాలి. పరిష్కారం దిశగా సాగితేనే అంతిమ విజయం దక్కుతుంది. ఈ మొత్తం ప్రక్రియలో సత్యవతి తడబాట్లు చాలానే ఉన్నాయని అంటున్నారు. ఆమె కనుక తనకు లభించిన ఈ మంచి అవకాశాన్ని వాడుకోకపోతే ఆమెతో పాటు వైసీపీకి కూడా రూరల్ జిల్లాలో ఇబ్బందులు తప్పవని సొంత పార్టీలోనే వినిపిస్తున్న మాట.