Mon Mar 16 2026 01:08:54 GMT+0530 (India Standard Time)
మహాచండీ దేవీ అలంకారంలో దుర్గమ్మ
నేడు దసరా శరన్నవరాత్రులు ఐదో రోజుకు చేరుకున్నాయి. ఈరోజు దుర్గమ్మ శ్రీ మహాచండీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు

నేడు ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రులు ఐదో రోజుకు చేరుకున్నాయి. ఈరోజు దుర్గమ్మ శ్రీ మహాచండీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. చండీదేవి అలంకారంలో దుర్గమ్మను దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో భక్తులు ఇంద్రకీలాద్రికి చేరుకున్నారు. ఏపీ నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా అత్యధిక సంఖ్యలో భక్తులు చేరుకోవడంతో ఇంద్రకీలాద్రిపై క్యూ లైన్లన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. భక్తులు ఇబ్బంది పడకుండా, సత్వరం దుర్గమ్మ దర్శనం పూర్తయ్యేలా ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లు చేసింది.
ఈ అలంకారంలో...
శ్రీ మహాచండీగా దేవతల కార్యసిద్ధి, దుష్ట శిక్షణ, శిష్టరక్షణ కొరకు మహాలక్ష్మీ, మహంకాళీ, మహా సరస్వతి త్రిశక్తి స్వరూపిణిగా శ్రీ మహా చండీ అమ్మవారు ఉద్భవించిందని పురాణాలు చెబుతున్నాయి. ఈ అలంకారంలో అనేక మంది దేవతలు కొలువై ఉండటంతో భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకుంటారని ఆలయ కమిటీ చెబుతుంది. శ్రీ మహాచండీ రూపంలో ఉన్న అమ్మవారిని ప్రార్ధిస్తే విద్య, కీర్తి, సంపదలు లభించి శత్రువులు మిత్రులుగా మారతారన్న ప్రతీతి ఉంది. కోరుకున్న కోరికలన్నీ ఫలిస్తాయంటారు.
Next Story

