Thu Mar 19 2026 22:43:11 GMT+0530 (India Standard Time)
నేడు మహానవమి.. మహిషాసుర మర్థిని దేవిగా దుర్గమ్మ
నేడు మహానవమి కావడంతో.. మహిషాసుర మర్థిని అలంకరణలో అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు

అయిగిరి నందిని నందితమేదిని విశ్వ వినోదిని నందినుతే
గిరివర వింధ్య-శిరోధిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే
భగవతి హేసితి కంఠ కుటుంబిని భూరి కుటుంబిని భూరికృతే
జయజయహే మహిషాసుర మర్థిని రంయక పర్థిని శైలసుతే
ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి వేడుకలు 9వ రోజుకి చేరుకున్నాయి. కనకదుర్గమ్మ తల్లి నేడు భక్తులకు ముదురు ఎరుపు రంగు చీర ధరించి, ఒకచేతిలో త్రిశూలం.. మరో చేతిలో ఖడ్గాన్ని చేతబూని శ్రీ మహిషాసుర మర్థిని అలంకరణలో భక్తులకు దర్శనమిస్తుంది. నేడు అమ్మవారికి చక్కెర పొంగలిని నైవేద్యంగా నివేదిస్తారు. నేడు మహానవమి పర్వదినం.. మహిషాసుర మర్థిని అలంకరణలో అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు వేకువ జాము నుంచే క్యూలైన్లలో వేచి చూస్తున్నారు.
శ్రీ మహిషాసుర మర్థిని కథ
మహిసుడు అనే రాక్షసుడు బ్రహ్మ గురించి తపస్సు చేసి మానవులు, దేవతల చేత మరణం లేకుండా వరం పొందుతాడు. అనంతరం స్వర్గలోకం మీద, భూలోకం మీద దండెత్తి దేవతలందర్నీ తరిమికొడతాడు. బ్రహ్మ శాపానికి తరుణోపాయంగా దేవతలందరూ వారి శక్తులన్నింటినీ క్రోడించి సమస్త శక్తివంతురాలైన దుర్గాదేవిని సృష్టిస్తారు. ప్రజలను పట్టిపీడిస్తున్న ఆ రాక్షసుడిని 9 రోజుల భీకర యుద్ధానంతరం.. వధిస్తుంది. మహిసుడు అనే రాక్షసుడిని వధించడంతో అమ్మవారిని నేడు మహిషాసుర మర్దినిగా పూజిస్తారు.
శ్రీశైలంలో..
శ్రీశైలంలో దసరా నవరాత్రి ఉత్సవాలు 9వ రోజుకు చేరుకున్నాయి. నేడు భ్రమరాంబిక దేవి సిద్ధిదాయిని అలంకారంలో భక్తులకు దర్శనమిస్తుంది. ఈమె అన్ని సిద్ధిలనూ ప్రసాదిస్తుందని ప్రతీతి. పరమేశ్వరుడు సర్వ సిద్ధులను ఈ దేవీ కృపతో పొందినట్లు పురాణాలు చెబుతున్నాయి. నేటి అలంకరణలో అమ్మవారికి అశ్వవాహన సేవ నిర్వహిస్తారు.
Next Story

