పెన్షనర్ కార్డ్ మోసం… రిటైర్డ్ బ్యాంకర్కు ₹20 లక్షల దెబ్బ
నకిలీ క్రెడిట్ కార్డ్ ఆఫర్తో వల నాలుగు ఖాతాల నుంచి ఏడు లావాదేవీలు

హైదరాబాద్: మెహిదీపట్నం ప్రాంతానికి చెందిన 78 ఏళ్ల రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగి ఆన్లైన్ మోసానికి గురై ₹20 లక్షలు కోల్పోయారు. బ్యాంకు అధికారులమంటూ మాట్లాడిన సైబర్ నేరగాళ్లు ‘పెన్షనర్ క్రెడిట్ కార్డ్’ పేరుతో నకిలీ ఆఫర్ చూపించి డబ్బు దోచుకున్నట్లు తెలిసింది.
మెహిదీపట్నానికి చెందిన సిస్ట్ల శ్రీనివాసరావు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫిబ్రవరి 13, 2026 రాత్రి తనకు సంబంధం లేని లావాదేవీలపై బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి వరుసగా అలర్ట్లు వచ్చాయని తెలిపారు. వెంటనే బ్యాంకు కస్టమర్ కేర్ కు, జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్లైన్ 1930కు ఫోన్ చేసి ఖాతాలను బ్లాక్ చేయాలని కోరినట్లు చెప్పారు.
ఫిర్యాదు ప్రకారం ఫిబ్రవరి 13న నాలుగు బ్యాంకు ఖాతాల నుంచి ఏడు లావాదేవీలు జరిగాయి. మొత్తం ₹20 లక్షలు మాయం అయ్యాయి. నిందితులు తన ఫిక్స్డ్ డిపాజిట్లను గడువుకు ముందుగానే బ్రేక్ చేసి ఆ డబ్బును కూడా లావాదేవీలకు ఉపయోగించినట్లు పేర్కొన్నారు. ఇవి కుటుంబ సభ్యులతో కలిసి నిర్వహిస్తున్న జాయింట్ ఖాతాలేనని తెలిపారు.
‘యూనియన్ రిటైర్డ్ స్టాఫ్ బెనిఫిట్స్’ పేరిట నకిలీ పేజీ
సైబర్ క్రైమ్ పోలీసుల వద్ద విచారణలో ‘యూనియన్ రిటైర్డ్ స్టాఫ్ బెనిఫిట్స్’ పేరుతో ఒక పేజీ నడుస్తోందని, అందులో ‘యూనియన్ పెన్షన్ రిటైర్డ్ కార్డ్’ ఇస్తామని చూపించి మోసం చేస్తున్నట్లు తెలిసిందని శ్రీనివాసరావు చెప్పారు.
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లోగోను ప్రొఫైల్ చిత్రంగా పెట్టిన ఒక ఏపీకే ఫైల్ మొబైల్కు పంపారని తెలిపారు. ఇదే మోసగాళ్ల పని విధానమని పోలీసులు వివరించినట్లు చెప్పారు.
నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, డబ్బు చేరిన లబ్ధిదారుల ఖాతాలను ఫ్రీజ్ చేసి మరింత దుర్వినియోగం ఆపాలని, తనకు నష్టం అయిన మొత్తాన్ని తిరిగి అందేలా చర్యలు చేపట్టాలని శ్రీనివాసరావు కోరారు.
పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

