₹3.64 కోట్ల సైబర్ మోసం నకిలీ ‘మానో మానో’ ట్రేడింగ్ యాప్తో హైదరాబాద్ వ్యాపారికి భారీ నష్టం
ఫేస్బుక్ పరిచయం… పెట్టుబడుల పేరుతో మోసం వస్తువులు కొనుగోలు చేస్తే కమిషన్ వస్తుందని నమ్మబలికింది

నగరానికి చెందిన 64 ఏళ్ల వ్యాపారి ఆన్లైన్ ట్రేడింగ్ మోసంలో ₹3,64,34,437 కోల్పోయినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. “మానో మానో” పేరుతో ఉన్న ఒక ప్లాట్ఫారమ్ ద్వారా ఈ మోసం జరిగినట్లు ఆయన తెలిపారు.
ఫేస్బుక్ పరిచయం…
వ్యాపారి సోసకొండ్ల ప్రతాప్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం, 2025 నవంబర్ 23న ‘మీరా’ అనే మహిళ ఫేస్బుక్ ద్వారా అతనిని సంప్రదించింది. తాను “మానో మానో” ఆన్లైన్ షాపింగ్ యాప్తో అనుబంధం ఉన్న పెట్టుబడిదారినని పరిచయం చేసుకుంది.
తర్వాత manokestore అనే లింక్ పంపి, ఆ ప్లాట్ఫారమ్లో డబ్బు పెట్టుబడి పెట్టాలని ప్రోత్సహించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. మార్కెట్ అవకాశాలను కంపెనీ విశ్లేషిస్తుందని, వినియోగదారులు యాప్లో చూపిన వస్తువులు కొనుగోలు చేస్తే సరిపోతుందని ఆమె చెప్పినట్లు తెలిపారు.
వస్తువులు కొనుగోలు చేస్తే కమిషన్...
ఆ ప్లాట్ఫారమ్లో వస్తువులు కొనుగోలు చేసిన తర్వాత కస్టమర్లు వాటిని కొనుగోలు చేస్తారని, అందుకు కమిషన్ లేదా లాభం వాలెట్లో జమ అవుతుందని మీరా చెప్పినట్లు ప్రతాప్ రెడ్డి తెలిపారు.
“ఆమె చెప్పిన మాటలు నమ్మి లాభాలు వస్తాయని భావించి వరుసగా డబ్బు పెట్టి వస్తువులు కొనుగోలు చేశాను. వాలెట్లో జమ అయిన డబ్బును తర్వాత తీసుకోవచ్చని అనుకున్నాను,” అని ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఆర్డర్లు వస్తున్నాయి....
తర్వాత కొత్త ఆర్డర్లు వస్తున్నాయని చెప్పి మరిన్ని చెల్లింపులు చేయాలని ఒత్తిడి చేసినట్లు ఆయన తెలిపారు. అనంతరం స్టోర్ ఖాతా, మీరా ఖాతా ఫ్రీజ్ అయ్యాయని, బాకీ చెల్లింపులు పూర్తయ్యే వరకు అవి తెరవలేమని నిందితులు చెప్పినట్లు తెలిపారు.
ఖాతాను తిరిగి ప్రారంభించాలంటే భారీ సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించాలని కోరినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ షరతులు చూసి ప్లాట్ఫారమ్ నిజస్వరూపంపై అనుమానం వచ్చిందని ఆయన చెప్పారు.
ప్రతాప్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం, తన యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరియు ఐసీఐసీఐ బ్యాంక్ ఖాతాల నుంచి దేశంలోని పలు బ్యాంకులకు డబ్బు బదిలీ చేశారు. అందులో ఇండస్ఇండ్ బ్యాంక్, బంధన్ బ్యాంక్, యెస్ బ్యాంక్ తదితర బ్యాంకుల ఖాతాలు ఉన్నాయి. ఈ లావాదేవీలు 2026 జనవరి 12 నుంచి మార్చి 5 మధ్య జరిగాయని తెలిపారు.
ఈ మోసం గుర్తించిన తర్వాత 2026 మార్చి 9న నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్లో ఫిర్యాదు చేసినట్లు ప్రతాప్ రెడ్డి తెలిపారు. మోసానికి బాధ్యులపై చర్యలు తీసుకుని తన డబ్బు తిరిగి పొందేలా చూడాలని అధికారులను కోరారు.

