Digital arrest Scam: డిజిటల్ అరెస్టు పేరిట రూ.7.12 కోట్ల మోసం
సోమాజిగూడ వృద్ధ వ్యాపారిని రెండు నెలలు భయపెట్టి నగదు బదిలీలు

హైదరాబాద్: సోమాజిగూడకు చెందిన 81 ఏళ్ల రిటైర్డ్ వ్యాపారిని ‘డిజిటల్ అరెస్టు’ పేరుతో మోసగాళ్లు రూ.7.12 కోట్లకు పైగా మోసం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. కొరియర్ సిబ్బంది, పోలీసులమని నటించిన వారు రెండు నెలల పాటు బెదిరింపులకు పాల్పడి నగదు బదిలీలు చేయించారు.
కొరియర్, పోలీసులమని మాయ
ఫిర్యాదు వివరాల ప్రకారం అక్టోబర్ 27, 2025న బాధితుడికి వాట్సాప్ కాల్ వచ్చింది. తాను కొరియర్ సంస్థ కస్టమర్ కేర్ నుంచి సునీల్ శర్మనని పరిచయం చేసుకున్న వ్యక్తి, ముంబై నుంచి బ్యాంకాక్కు బాధితుడి పేరుతో పంపిన పార్సెల్లో డ్రగ్స్, పాస్పోర్టులు ఉన్నాయన్నాడు.
దీనిని బాధితుడు ఖండించడంతో వెంటనే మరో వ్యక్తి ముంబై పోలీసునని చెప్పి ఫోన్ చేశాడు. డ్రగ్ ట్రాఫికింగ్, మనీ లాండరింగ్, ఉగ్రవాద సంబంధాలు ఉన్నాయంటూ ఆరోపించాడు. ‘డిజిటల్ అరెస్టు’లో ఉన్నారని, కుటుంబ సభ్యులు, బ్యాంకర్లు, న్యాయవాదులకు చెప్పొద్దని హెచ్చరించినట్లు పోలీసులు తెలిపారు.
రెండు నెలలు ఒత్తిడి… వరుస బదిలీలు
నిరంతర బెదిరింపులతో బ్యాంక్ ఖాతాలు, నిధుల వివరాలు “వెరిఫికేషన్” పేరిట కోరారు. అక్టోబర్ 29, 2025న సిటీ యూనియన్ బ్యాంక్ ఖాతాకు RTGS ద్వారా రూ.19.80 లక్షలు బదిలీ చేయించారు. ఆ మొత్తం తిరిగి వస్తుందని నమ్మబలికారు.
తర్వాత సిగ్నల్ యాప్ ఇన్స్టాల్ చేయించి పెట్టుబడులు, పొదుపుల వివరాలు తీసుకున్నారు. నవంబర్ నుంచి డిసెంబర్ తొలి వారాల మధ్య వివిధ ప్రైవేట్ కంపెనీల ఖాతాలకు పెద్ద మొత్తాల్లో నగదు బదిలీ చేయించారు. మొత్తం రూ.7,12,80,000కు చేరిందని పోలీసులు చెప్పారు.
డిసెంబర్ 29, 2025న కేసు ముగిస్తామంటూ అదనంగా రూ.1.2 కోట్లు కోరడంతో బాధితుడు అనుమానపడ్డాడు. పత్రికల్లో ఇలాంటి మోసాల వార్తలు చదివిన తర్వాత విషయం బయటపెట్టాడు.
- Tags
- Cyber Crime
- Fraud

