సైబరాబాద్లో భారీ బ్యాంక్ ఖాతాల రాకెట్ బస్టు
సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు బ్యాంక్ ఖాతాలను పెద్ద ఎత్తున మోసగాళ్లకు సరఫరా చేసే రాకెట్ను బట్టబయలు చేశారు. ఈ క్రమంలో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.

Bank account racket: సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు బ్యాంక్ ఖాతాలను పెద్ద ఎత్తున మోసగాళ్లకు సరఫరా చేసే రాకెట్ను బట్టబయలు చేశారు. ఈ క్రమంలో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. అక్టోబర్ 6న కేపీహెచ్బీ లోని లోధా మెరిడియన్ అపార్ట్మెంట్లో పోలీసులు దాడి నిర్వహించారు.
సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ జి. విజయ్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం — సాయంత్రం 5.30 గంటల సమయంలో ఫ్లాట్ నంబర్ A-1809లో బ్యాంక్ ఖాతాలను అక్రమంగా సరఫరా చేస్తున్న సమాచారం అందింది. ఏసీపీ ఆదేశాలతో డీసీపీ సైబర్ క్రైమ్ నుంచి అనుమతి తీసుకుని, పోలీసులు ఇద్దరు మధ్యవర్తులతో కలిసి సాయంత్రం 6 గంటలకు దాడి చేశారు.
బెంగళూరులో హ్యాండ్లర్కు ఖాతాలు పంపిణీ
దాడిలో ఇడుపులపాడు (బాపట్ల జిల్లా)కు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి దొప్పలపూడి నవీన్కుమార్ (31)ను పోలీసులు పట్టుకున్నారు. అతడు టెలిగ్రామ్లో ‘క్యాపిటల్ ఓ ఫైనాన్స్’ అనే అకౌంట్ ద్వారా పరిచయమైన వ్యక్తి ఆఫర్ ఇచ్చిన తర్వాత ఈ వ్యాపారం మొదలుపెట్టినట్టు ఒప్పుకున్నాడు. ఖాతా ఒక్కింటికి ₹10,000 చొప్పున కమిషన్ పొందేవాడని తెలిపాడు.
నవీన్తో పాటు రాజమండ్రికి చెందిన ప్రైవేట్ ఉద్యోగి వంకద్రి సందీప్కుమార్ (37)ను సహాయకుడిగా నియమించుకున్నాడు. ఇద్దరూ నిరపరాధుల వివరాలు సేకరించి ఒక్కో ఖాతా కోసం వారికి ₹2,000–₹3,000 చెల్లించేవారు. సిమ్ కార్డులు, బ్యాంక్ వివరాలు బెంగళూరులోని అర్వేశ్ అనే వ్యక్తికి ప్రైవేట్ ట్రావెల్ సర్వీసుల ద్వారా పంపేవారని పోలీసులు తెలిపారు.
బ్యాంకు సిబ్బంది సాయంతో వంద ఖాతాలు
కొన్ని బ్యాంకుల బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్ల (BDMs) సహకారంతో నకిలీ పేర్లపై ఖాతాలు తెరవడం జరిగినట్టు నిందితులు ఒప్పుకున్నారు. దొంగతనాల కోసం వీటిని ఉపయోగించేవారని పోలీసులు తెలిపారు.
స్వాధీనం చేసుకున్న వస్తువులు
దాడిలో పోలీసులు 32 చెక్బుక్లు, 23 ఏటీఎం కార్డులు, 48 సిమ్ కార్డులు, మూడు మొబైల్ ఫోన్లు, ఒక తెలుపు రంగు యాక్టివా స్కూటీని స్వాధీనం చేసుకున్నారు.
నిందితులు బెంగళూరులోని సహచరుడితో కలిసి నకిలీ ఆన్లైన్ ఫైనాన్స్ యాప్లు సృష్టించి, పెట్టుబడుల పేరుతో ప్రజలను మోసం చేసినట్టు పోలీసులు తెలిపారు. ఇద్దరినీ అదుపులోకి తీసుకుని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

