నకిలీ ఫైనాన్స్ అధికారి చేతిలో మోసపోయిన భువనగిరి ప్రభుత్వ ఉపాద్యాయుడు
పూనావల్లా ఫైనాన్స్ అధికారి పేరుతో మోసం ₹6 లక్షల రుణం ఆఫర్ చేసి ₹2.4 లక్షలు ఎగనామం

భువనగిరి: ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు ఆన్లైన్ రుణ మోసానికి బలయ్యాడు. పూనావల్లా ఫైనాన్స్ సంస్థ ఉద్యోగినని చెప్పుకుంటూ ఓ మోసగాడు ₹6 లక్షల రుణం ఇస్తానని చెప్పి ₹2.4 లక్షలు గుంజాడు.
రుణం ఇస్తానని నమ్మించి పత్రాలు తీసుకున్నాడు
భువనగిరి కు చెందిన నెనవత్ శంకర్ (45) జూలై 6, 2025న +91 93102 ****5 అనే తెలియని నంబర్ నుంచి కాల్ అందుకున్నాడు. కాల్ చేసిన వ్యక్తి తనను అనూప్ కుమార్ తివారి, పూనావల్లా ఫైనాన్స్ కార్ప్లో పనిచేస్తానని చెప్పి ₹6 లక్షల రుణం తక్కువ వడ్డీతో ఇస్తానని తెలిపాడు. నమ్మిన శంకర్ తన ఆధార్, పాన్, బ్యాంక్ పాస్బుక్, ఫోటో, క్యాన్సిల్ చెక్ పంపించాడు. అదే రోజు అతని ఖాతాలో ₹6.17 లక్షలు జమయ్యాయి.
‘అధికంగా జమైందని’ చెప్పి డబ్బు పంపించేశాడు
తరువాత కాల్ చేసి అసలు రుణం ₹3.77 లక్షలేనని, పొరపాటున ₹2.40 లక్షలు ఎక్కువగా జమయ్యాయని చెప్పాడు. నమ్మి శంకర్ గూగుల్ పే ద్వారా వేర్వేరు రోజుల్లో ₹2.40 లక్షలు బదిలీ చేశాడు.
తరువాత వివరాలు చెక్ చేయగా మోసపోయినట్టు తెలిసింది. అక్టోబర్ 29, 2025న సైబర్ క్రైమ్ పోర్టల్ (హెల్ప్లైన్ 1930) ద్వారా ఫిర్యాదు చేశాడు. అనంతరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదు చేయించాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.

