Sat Jul 27 2024 06:14:44 GMT+0000 (Coordinated Universal Time)
వెంటపడి వేధిస్తున్నాడని.. యువకుడిని చంపిన యువతి
సంగీతను ప్రేమిస్తున్నానని, పెళ్లికి ఒప్పుకోవాలని శ్రీనివాస్ కొంతకాలంగా వేధిస్తున్నాడు. ఈ వేధింపులు మరింత ఎక్కువ అవడంతో..
![mulugu crime news, woman kills a man mulugu crime news, woman kills a man](https://www.telugupost.com/h-upload/2023/03/30/1485533-woman-kills-a-man.webp)
నిన్ను ప్రేమిస్తున్నా.. నన్ను పెళ్లి చేసుకో అంటూ.. సమీప బంధువైన ఓ యువకుడు యువతిని వేధిస్తుండటంతో.. ఆ యువకుడిని యువతి హతమార్చింది. ఈ ఘటన ములుగు జిల్లాలో చోటుచేసుకోగా.. యువకుడి హత్య స్థానికంగా కలకలం రేపింది. యువకుడిని చంపిన అనంతరం ఆ యువతి నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయింది. జిల్లాలోని ఏటూరు నాగారం మండలం ఎర్రలవాడలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
శ్రీనివాస్ అనే యువకుడు.. సంగీత అనే యువతికి దగ్గరి బంధువు. ఇరు కుటుంబీకులు కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. సంగీతను ప్రేమిస్తున్నానని, పెళ్లికి ఒప్పుకోవాలని శ్రీనివాస్ కొంతకాలంగా వేధిస్తున్నాడు. ఈ వేధింపులు మరింత ఎక్కువ అవడంతో విసిగిపోయిన సంగీత శ్రీనుపై వేధింపుల కేసు పెట్టింది. దాంతో అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. కొంతకాలానికి జైలు నుంచి విడుదలైన శ్రీను.. తన ప్రవర్తనను ఏమాత్రం మార్చుకోలేదు. మళ్లీ సంగీతను వేధించడం మొదలుపెట్టాడు. మద్యం తాగి వచ్చి వేధిస్తుండటంతో.. భరించలేకపోయిన యువతి శ్రీను చేతుల్ని కట్టేసి కత్తితో పొడిచి హతమార్చింది. అనంతరం నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి జరిగిందంతా చెప్పి.. లొంగిపోయింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
Next Story