Sat Jul 27 2024 09:27:20 GMT+0000 (Coordinated Universal Time)
పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం.. యువతి ఆత్మహత్య
ప్రియుడి చేతిలో మోసపోవడాన్ని జీర్ణించుకోలేకపోయిన ఆ యువతి.. సెల్ఫీ వీడియోలో తన చావుకి కారణం చెప్పి..
![young girl committed suicide, mancherial district young girl committed suicide, mancherial district](https://www.telugupost.com/h-upload/2022/10/08/1423094-suicide.webp)
పెళ్లి చేసుకుని నిన్ను చాలా బాగా చూసుకుంటానని చెప్పి నమ్మబలికాడు. ఆపై మోసం చేశాడు. ప్రియుడి చేతిలో మోసపోవడాన్ని జీర్ణించుకోలేకపోయిన ఆ యువతి.. సెల్ఫీ వీడియోలో తన చావుకి కారణం చెప్పి.. ఆత్మహత్యకు పాల్పడింది. తెలంగాణలోని మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో జరిగిందీ ఘటన. వివరాల్లోకి వెళ్తే.. షంషీర్ నగర్ కు చెందిన యువతి, నెన్నెల మండలం లంబాడి తండాకు చెందిన ధరావత్ రాజ్ కుమార్ కొంతకాలంగా ప్రేమించుకున్నారు. యువతిని పెళ్లిచేసుకుంటానని చెప్పి.. ఇంటి నుంచి తీసుకెళ్లిన రాజ్ కుమార్ ఆమెను రహస్య ప్రదేశంలో ఉంచాడు.
ఆ తర్వాత పెళ్లి గురించి మాట్లాడకపోగా.. తప్పించుకుని తిరుగుతుండటంతో తాను మోసపోయానని గ్రహించింది యువతి. మనస్తాపంతో పురుగుల మందు తాగి తన ఊరైన లంబాడితండాకు ఆటోలో బయలుదేరింది. ఈ క్రమంలో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. గమనించిన ఆటో డ్రైవర్ వెంటనే ఆమెను స్థానిక పీహెచ్సీ సెంటర్కు తరలించాడు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం మంచిర్యాలకు తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ యువతి మృతి చెందింది. యువతి మొబైల్ లో సెల్ఫీ వీడియో బయటపడింది. రాజ్కుమార్ను నమ్మి అందరినీ వదిలేసి ఇంటి నుంచి వచ్చేశానని, ఇప్పుడు అతడు తప్పించుకుని తిరుగుతున్నాడని, వేరే దారిలేక చనిపోతున్నానంటూ కంటతడి పెట్టుకుంది.
Next Story