Thu Apr 25 2024 21:55:52 GMT+0000 (Coordinated Universal Time)
కరీంనగర్లో ఘోర ప్రమాదం.. దంపతులు మృతి
కరీంనగర్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. లారీ, కారు ఢీకొన్న ఘటనలో దంపతులు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు తీవ్రగాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మానకొండూర్ మండలం ముంజంపల్లి వద్ద హైవేపై ఈ ప్రమాదం జరిగింది. లారీ ఢీకొనడంతో కారులో ప్రయాణిస్తున్న భార్యాభర్తలు మాధవి, సురేందర్ మృతి చెందారు. వరంగల్ జిల్లా కాశీబుగ్గకు చెందిన సురేందర్ దంపతులు వేములవాడ రాజన్న దర్శనం కోసం కారులో బయలుదేరారు. వారితో పాటు మేఘన, అశోక్ కూడా ఉన్నారు. ముంజంపల్లి వద్ద కారును లారీ ఢీకొనడంతో సురేందర్ అక్కడికక్కడే చనిపోయారు. తీవ్రగాయాలపాలైన ఆయన భార్య మాధవిని ఆస్పత్రికి తీసుకెళ్తుండగా ప్రాణాలు విడిచారు. మేఘన, అశోక్లకు తీవ్రగాయాలయ్యాయి. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషాద ఘటనతో స్వస్థలం కాశీబుగ్గలో తీవ్ర విషాదం నెలకొంది.
Next Story