Sat Jul 27 2024 05:18:26 GMT+0000 (Coordinated Universal Time)
విద్యార్థిని ప్రాణం ఖరీదు పావుతులం ఉంగరం.. వరంగల్ లో దారుణం
పెద్ద కుమార్తె హేమలతారెడ్డి(19) హనుమకొండలోని ఓ ప్రైవేటు కాలేజీలో బీకాం రెండో సంవత్సరం చదువుతుంది.
![warangal degree student hemalatha warangal degree student hemalatha](https://www.telugupost.com/h-upload/2023/03/29/1485061-degree-student-suicide.webp)
డిగ్రీ సెకండియర్ చదువుతున్న ఓ విద్యార్థిని తన ప్రాణానికి తానే లెక్క కట్టుకుంది. బంగారం కంటే ప్రాణం విలువైనదని తెలుసుకోకుండా.. తల్లిదండ్రులు మందలిస్తారన్న భయంతో బలవన్మరణానికి పాల్పడింది. చేతి వేలికి ఉన్న పావుతులం ఉంగరం కనిపించకుండా పోవడంతో.. క్షమించు నాన్న అంటూ సూసైడ్ లెటర్ రాసి.. తనువు చాలించింది. ఈ విషాద ఘటన వరంగల్ జిల్లాలో మంగళవారం (మార్చి 28) సాయంత్రం చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ జిల్లా దంతాలపల్లి మండలం గున్నేపల్లి గ్రామానికి చెందిన మద్దుల జానకి రాములు, రాణి దంపతులకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె హేమలతారెడ్డి(19) హనుమకొండలోని ఓ ప్రైవేటు కాలేజీలో బీకాం రెండో సంవత్సరం చదువుతుంది. చిన్న కుమార్తె అశ్విత మరిపెడలోని సాంఘిక సంక్షేమ పాఠశాలలో ఎనిమిదవ తరగతి చదువుతుంది. హేమలత ఉగాది పండుగకు మార్చి 20న ఇంటికి వచ్చింది. ఈ క్రమంలో తన చేతికి ఉన్న పావుతులం బంగారపు ఉంగరం ఎక్కడో జారిపోయింది. ఇల్లు, తాను వెళ్లిన ప్రదేశాలు ఎంత వెతికినా ఉంగరం దొరకలేదు. ఆరునెలల క్రితం మెడలోని గోల్డ్ చైన్ కూడా పోయింగి. అప్పుడు చైన్, ఇప్పుడు ఉంగరం పోగొట్టుకోవడంతో.. తల్లిదండ్రులు మందలిస్తారన్న భయంతో సూసైడ్ లెటర్ రాసి ఇంట్లోనే చున్నీతో ఉరిపెట్టుకుని బలవన్మరణం చెందింది.
పొలం పనులకని వెళ్లిన తల్లిదండ్రులు తిరిగి ఇంటికి వచ్చేసరికి తలుపులు లోపలి నుంచి గడియ పెట్టి ఉండటంతో అనుమానం వచ్చింది. తలుపులను బలవంతం తెరిచి చూడగా.. పెద్దకూతురు హేమలత ఉరికి వేలాడుతూ కనిపించింది. కూతుర్ని విగతజీవురాలుగా చూసి తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతురాలి ఫోన్తోపాటు, సూసైడ్ లెటర్ను స్వాధీనం చేసుకున్నారు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై జగదీష్ తెలిపారు.
Next Story