Sun Mar 08 2026 02:54:35 GMT+0530 (India Standard Time)
చిత్తూరులో వాలంటీర్ ఆత్మహత్య.. వైసీపీ నేతలే కారణమంటూ లేఖ
పెద్ద మొత్తంలో డబ్బులు అప్పుగా ఇచ్చానని, పలు మార్లు డబ్బులు అడిగినా ఇవ్వకపోగా బెదిరించినట్లు వెల్లడించాడు.

చిత్తూరు జిల్లాలో వాలంటీర్ ఆత్మహత్య కలకలం రేపింది. జోగు కాలనీలో శరవణ అనే వాలంటీర్ ఆదివారం రాత్రి బలవన్మరణానికి పాల్పడ్డాడు. అంతకుముందు రాసిన సూసైడ్ నోట్ లో తన చావుకి వైసీపీ నేతలో కారణమంటూ రాశాడు. వైసీపీ నేతలు తన వద్ద పెద్ద మొత్తంలో డబ్బులు అప్పుగా తీసుకున్నారని.. తిరిగి ఇవ్వాలని అడిగితే.. తన కుటుంబాన్ని చంపేస్తామని బెదిరించినట్లు ఆ లేఖలో పేర్కొన్నాడు.
చిత్తూరు వైసీపీ నాయకుడు సయ్యద్, రాష్ట్ర మహిళ ఫైనాన్స్ కమిషన్ డైరెక్టర్ అంజలి తనకు డబ్బులు ఇవ్వాలని లెటర్ లో రాశాడు. పెద్ద మొత్తంలో డబ్బులు అప్పుగా ఇచ్చానని, పలు మార్లు డబ్బులు అడిగినా ఇవ్వకపోగా బెదిరించినట్లు వెల్లడించాడు. బలవంతంగా నీ కుటుంబాన్ని ఏమైనా చేస్తామని వాలంటీర్ ను బెదిరించినట్లు తెలుస్తోంది. శరవణ ఈ విషయాలన్నింటినీ లేఖలో రాసి.. గతరాత్రి ఇంట్లోనే బలవన్మరణానికి పాల్పడ్డాడు.
డబ్బులు తీసుకున్న వ్యక్తులు శరవణ ఇంటికెళ్లగా.. అతని సంపాదనంతా.. మీకే అప్పుగా ఇచ్చాడంటూ కుటుంబ సభ్యులు గొడవకు దిగారు. అధికార పార్టీ నేతలు వాలంటీర్ దగ్గర డబ్బులు తీసుకుని అతని మరణానికి కారణమయ్యారని స్థానికులు సైతం మండిపడుతున్నారు. పోలీసులు శరవణ మరణంపై కేసు నమోదు చేసుకుని.. మృతదేహాన్ని పోస్టుమార్టమ్ కు పంపారు.
Next Story

