Fri Dec 05 2025 16:54:06 GMT+0000 (Coordinated Universal Time)
ఏలూరులో విషాదం.. కొల్లేరు సరస్సులో మునిగి ఇద్దరు మృతి
గ్రామస్తుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. స్థానికులతో కలిసి గల్లంతైన వారి ఆచూకీ కోసం గాలించారు. ఈ క్రమంలో..

ఆంధ్రప్రదేశ్ లోని ఏలూరు జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఏలూరు రూరల్ మండలం శ్రీపర్రులో ఉన్న కొల్లేరు సరస్సులో ప్రమాద వశాత్తు పడవ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆరుగురు గల్లంతవగా.. ఇద్దరు మహిళలు మృతి చెందారు. సరస్సులో పేరుకుపోయిన తూడు కోసేందుకు కూలీలతో వెళ్లిన పడవ ఒక్కసారిగా తిరబడటంతో ప్రమాదం జరిగింది. ఆరుగురు కూలీల్లో నలుగురు ప్రాణాలతో బయటపడ్డారు. మరో ఇద్దరు నీటిలో మునిగి మృతి చెందారు.
గ్రామస్తుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. స్థానికులతో కలిసి గల్లంతైన వారి ఆచూకీ కోసం గాలించారు. ఈ క్రమంలో ఇద్దరు మహిళల మృతదేహాలను వెలికితీశారు. మృతులు శ్రీపర్రుకు చెందిన పైడమ్మ, గౌరమ్మగా పోలీసులు గుర్తించారు. ఇద్దరు మహిళల మృతితో శ్రీపర్రు గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రాణాలతో బయటపడిన కూలీలకు స్వల్పగాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఏలూరు రూరల్ పోలీసులు వెల్లడించారు.
Next Story

