Wed Jan 21 2026 22:23:54 GMT+0000 (Coordinated Universal Time)
రెండు ఆర్టీసీ బస్సులు ఢీ.. 30 మందికి గాయాలు
భైంసా నుంచి నిర్మల్ వెళ్తున్న ఆర్టీసీ బస్సును.. అదే రోడ్డులో వెళ్తున్న మరో ఆర్టీసీ బస్సు వెనుక నుంచి బలంగా ఢీ కొట్టింది.

నిర్మల్ : ఇటీవల కాలంలో ప్రతిరోజూ రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ప్రతినిత్యం రహదారులు నెత్తురోడుతున్నాయి. తాజాగా తెలంగాణలో రెండు ఆర్టీసీ బస్సులు ఢీ కొన్నాయి. నిర్మల్ జిల్లా భైంసా మండలం తిమ్మాపూర్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. రెండు ఆర్టీసీ బస్సులు పరస్పరం ఢీ కొనడంతో 30 మంది గాయపడ్డారు.
భైంసా నుంచి నిర్మల్ వెళ్తున్న ఆర్టీసీ బస్సును.. అదే రోడ్డులో వెళ్తున్న మరో ఆర్టీసీ బస్సు వెనుక నుంచి బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో 10 మంది తీవ్రంగా గాయపడగా.. మరో 20 మంది స్వల్పంగా గాయపడ్డారు. ఘటనా ప్రాంతానికి చేరుకున్న స్థానికులు 108 వాహనంలో క్షతగాత్రులను ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. ఇద్దరు మహిళలకు కాళ్లు విరగడంతో వారిని మెరుగైన చికిత్స కోసం నిర్మల్ కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
Next Story

