Fri Dec 05 2025 09:31:28 GMT+0000 (Coordinated Universal Time)
Kerala : తొక్కిసలాట.. నలుగురి విద్యార్థుల మృతి
కేరళలో విషాదం నెలకొంది. కొచ్చిలోని యూనివర్సిటీ వార్షికోత్సవంలో తొక్కిసలాట జరిగి నలుగురు విద్యార్థులు మృతి చెందారు

కేరళలో విషాదం నెలకొంది. కొచ్చిలోని సైన్స్ అండ్ టెక్నాలజీ యూనివర్సిటీ వార్షికోత్సవంలో తొక్కిసలాట జరిగి నలుగురు విద్యార్థులు మృతి చెందారు. ఈ తొక్కిసలాటలో 64 మంది వరకూ విద్యార్థులంతా గాయాలపాలయ్యారు. గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో కొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. నిన్న రాత్రి యూనివర్సిటీ వార్షికోత్సవం సందర్భంగా ఓపెన్ ఎయిర్ థియేటర్ లో మ్యూజికల్ షో ఏర్పాటు చేశారు. అధిక సంఖ్యలో హాజరయిన విద్యార్థులు మ్యూజిక్ నైట్ లో ఎంజాయి చేస్తుండగా వర్షం కురిసింది. దీంతో ఒక్కసారిగా తడవకుండా ఉండేందుకే పరుగులు తీశారు.
వర్షం కురవడంతో...
ఈ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో నలుగురు విద్యార్థులు మరణించినట్లు కేరళ ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జి తెలిపారు. గాయపడిన వారిలో నలుగురి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని చెబుతున్నారు. గాయపడిన విద్యార్థులందరినీ ప్రభుత్వ, ప్రయివేటు ఆసుపత్రికి తీసుకు వచ్చి చికిత్స అందిస్తున్నారు. మరణించిన వారిలో ఇద్దరు విద్యార్థులు, ఇద్దరు విద్యర్థినులు ఉన్నారు. విద్యార్థుల మరణం పట్ల కేరళ ప్రభుత్వం సంతాపాన్ని ప్రకటించింది. ఈ సంఘటన దురదృష్టకరమని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి జార్జి అన్నారు.
Next Story

