Fri Dec 05 2025 16:00:07 GMT+0000 (Coordinated Universal Time)
మూడు నెలల కూతుర్ని గొంతుకోసి చంపిన తల్లి
పాపకు తండ్రిపోలికలు వచ్చాయని అనడం ఎందుకో ఆ తల్లికి నచ్చేది కాదు. ప్రతీసారి అదే అనడంతో ఆమె మనస్తాపం చెందింది.

నవమాసాలు మోసి కనిన పిల్లలను క్షణికావేశంతో అత్యంత దారుణంగా కడతేరుస్తున్నారు. ఆడపిల్ల పుట్టిందని, పుట్టిన బిడ్డలు భారంగా ఉన్నారని, విలాసవంతమైన జీవితాలకు పిల్లలు అడ్డుగా ఉంటున్నారని ఇలా రకరకాల కారణాలతో పిల్లలను కడతేరుస్తున్న తల్లిదండ్రులెందరో. తాజాగా అలాంటి ఘటనొకటి మహారాష్ట్రలోని వెలుగుచూసింది. మూడు నెలల కూతుర్ని కన్నతల్లే గొంతుకోసి హతమార్చింది. మహారాష్ట్రలోని నాసిక్ లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
ఇటీవల ఓ మహిళ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం ఆ పాప వయసు 3 నెలలు. అయితే పుట్టినప్పటి నుంచీ పాపకు తండ్రి పోలికలు వచ్చాయని అత్తమామలు, బంధువులు, చుట్టుపక్కల వారు అనుకునేవారు. పాపకు తండ్రిపోలికలు వచ్చాయని అనడం ఎందుకో ఆ తల్లికి నచ్చేది కాదు. ప్రతీసారి అదే అనడంతో ఆమె మనస్తాపం చెందింది. చివరికి క్షణికావేశంతో పాప గొంతు కోసి హతమార్చింది. విషయం తెలుసుకున్న పోలీసులు మహిళ ఇంటికి వెళ్లి.. పాప మృతదేహాన్ని పోస్టుమార్టమ్ కు తరలించారు. కూతురి మృతిపై తల్లిని ప్రశ్నించగా ఆమె తడబడటంతో తమదైన శైలిలో విచారణ చేశారు. కూతుర్ని తానే చంపినట్లు అంగీకరించడంతో పోలీసులు మహిళను అరెస్ట్ చేశారు.
Next Story

