Mon Dec 15 2025 07:24:23 GMT+0000 (Coordinated Universal Time)
Jammu and Kashmir.: ఉగ్రవాదులు దాడి.. తొమ్మిది మంది మృతి
జమ్మూకాశ్మీర్ లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. యాత్రికుల ప్రయాణిస్తున్న బస్సుపై కాల్పులు జరిపారు.

జమ్మూకాశ్మీర్ లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. యాత్రికుల ప్రయాణిస్తున్న బస్సుపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో తొమ్మిది మంది ప్రయాణికులు మరణించారు. ఈ ఘటన జమ్మూకాశ్మీర్ లోని రియాసి జిల్లాలో జరిగింది. యాత్రికులు వెళుతున్న బస్సు పై ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. యాత్రికులు శివఖోడా ఆలయం నుంచి కత్రాకు వస్తుండగా ఈ దాడికి ఉగ్రవాదులు పాల్పడ్డారు. దీంతో ఒక్కసారిగా బస్సులో నుంచి హాహాకారాలు చేశారు. అయితే వెంటనే సమాచారం అందుకున్న పారామిలటటరి దళాలు అక్కడకు చేరుకున్న వెంటనే ఉగ్రవాదులు పారిపోయారు.
ప్రయాణికులతో....
రాజౌరి, పూంచ్, రియాసి ఎగువ ప్రాంతాల్లో మాటు వేసి మరీ ఈ దాడికి తెగబడ్డారని పోలీసులు తెలిపారు. మృతులంతా ఉత్తర్ప్రదేశ్ కు చెందిన వారుగా గుర్తించారు. బస్సు పై కాల్పులు జరపడంతో ఒక్కసారిగా డ్రైవర్ చేతిలో నుంచి అదుపు తప్పి కాల్వలో పడిపోయింది. ఈ ఘటనలో 33 మంది వరకూ గాయపడ్డారు. క్షతగాత్రులను పారామిలటరీ దళాలు వెంటనే ఆసుపత్రికి తరలించాయి. చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని చెబుతున్నారు. అయితే ఉగ్రవాదుల దాడిని కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ ఖండించారు. ప్రయాణికులు, అమాయకులపై కాల్పులకు తెగబడుతూ బీభత్సం సృష్టిస్తున్నారని ఆయన మండి పడ్డారు.
Next Story

