Sun Mar 08 2026 00:29:04 GMT+0530 (India Standard Time)
యువకుడి తలపై నుంచి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు
బైక్ నడుపుతున్న సాయిచరణ్ ప్రధాన రహదారిపై యూ టర్న్ తీసుకున్నాడు. అక్కడ రోడ్డు పునర్నిర్మాణానికి తెప్పించిన ఇసుక,

కొత్తగూడెం : పై చదువులు చదివి.. ఉన్నతంగా స్థిరపడాల్సిన ఆ యువకుడి జీవితాన్ని ఆర్టీసీ బస్సు రూపంలో మృత్యువు కబళించింది. బైక్ పై నుంచి కిందపడిన యువకుడు పైకి లేచేలోపే ఆర్టీసీ బస్సు అతని తలపై నుంచి దూసుకెళ్లడంతో.. యువకుడు దుర్మరణం చెందాడు. వివరాల్లోకి వెళ్తే.. కొత్తగూడెంకు చెందిన నర్సింహా స్థానిక మున్సిపాలిటీలో జవానుగా పనిచేస్తున్నారు. ఆయనకు ఇద్దరు కుమారులు. పెదకొడుకు సాయిచరణ్ లక్ష్మిదేవిపల్లిలోని ఒక ప్రైవేటు కళాశాలలో ఇంటర్ రెండో ఏడాది చదువుతున్నాడు. రోజూ మాదిరిగానే కళాశాలకు వెళ్లిన సాయిచరణ్ మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో సమీప బంధువైన మరో విద్యార్థి బైక్ పై ఇంటికి బయల్దేరాడు.
బైక్ నడుపుతున్న సాయిచరణ్ ప్రధాన రహదారిపై యూ టర్న్ తీసుకున్నాడు. అక్కడ రోడ్డు పునర్నిర్మాణానికి తెప్పించిన ఇసుక, సిమెంటు బిళ్లలు ఉన్నాయి. యూ టర్న్ తీసుకునే క్రమంలో బైక్ సిమెంటు బిళ్లలపైకి ఎక్కింది. దాంతో బైక్ అదుపుతప్పి కిందపడింది. ఇద్దరూ కిందపడిపోయారు. అదే సమయంలో భద్రాచలం నుంచి కొత్తగూడెం వైపు వస్తున్న ఆర్టీసీ బస్సు సాయిచరణ్ తల మీదుగా దూసుకెళ్లింది. ఈ ఘటనలో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. సాయిచరణ్ హెల్మెట్ ధరించినా ప్రాణం దక్కలేదు. బస్సు డ్రైవర్ అతివేగం, నిర్లక్ష్య డ్రైవింగ్ వల్లే తన కొడుకు చనిపోయాడంటూ సాయిచరణ్ తండ్రి నర్సింహా పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ప్రమాద స్థలాన్ని పరిశీలించి, చరణ్ మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు.
Next Story

