Sat Jul 27 2024 02:05:59 GMT+0000 (Coordinated Universal Time)
షార్ట్ సర్క్యూట్.. ఆరుగురి సజీవదహనం
ఉర్ధా ప్రాంతంలో సంగీత (38) అనే మహిళ తన ఐదుగురు పిల్లలతో కలిసి ఇంట్లో నిద్రిస్తుండగా.. ఆమె భర్త, అత్తమామలు..
![uttarpradesh crime news uttarpradesh crime news](https://www.telugupost.com/h-upload/2023/06/15/1512138-crime-scene.webp)
షార్ట్ సర్క్యూట్ రూపంలో తల్లి సహా ఐదుగురు పిల్లల్ని మృత్యువు కబళించింది. ఈ ఘోర అగ్నిప్రమాదంలో ఆరుగురు సజీవదహనమయ్యారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని కుశినగర్ జిల్లాలో జరిగింది. బుధవారం రాత్రి జరిగిన ఈ ప్రమాదంపై పూర్తి వివరాలను పోలీసులు తాజాగా వెల్లడించారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఉర్ధా ప్రాంతంలో సంగీత (38) అనే మహిళ తన ఐదుగురు పిల్లలతో కలిసి ఇంట్లో నిద్రిస్తుండగా.. ఆమె భర్త, అత్తమామలు ఇంటిబయట నిద్రిస్తున్నారు. అందరూ గాఢ నిద్రలో ఉండగా.. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరిగి గ్యాస్ సిలిండర్ పేలింది.
నిద్రిస్తున్న వారు లేచి చూసేసరికి.. క్షణాల్లోనే మంటలు ఇల్లంతా వ్యాపించాయి. లోపల భార్య, పిల్లల అరుపులు విన్న భర్త, అత్తమామలు స్థానికులతో కలిసి కాపాడే ప్రయత్నం చేసినా ఫలితం దక్కలేదు. మంటల తీవ్రత ఎక్కువగా ఉండటంతో లోపలికి వెళ్లలేకపోయారు. ఘటనా ప్రాంతానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపుచేసి వారందరినీ బయటికి తీసుకొచ్చారు. కానీ అప్పటికే అందరూ మరణించారు. మృతులు సంగీత, బాబు(1), గీత(2), రీత(3), లక్ష్మిణ (9), అంకిత్ (10)లుగా గుర్తించారు. ఈ ఘటనపై సీఎం యోగిఆదిత్యనాథ్ దిగ్భ్రాంతి చెందారు. బాధిత కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఒక్కొక్కరికి రూ.4 లక్షల చొప్పున రూ.24 లక్షల ఆర్థిక సహాయాన్ని అందజేయనున్నట్లు తెలిపారు.
Next Story