Thu Mar 19 2026 13:53:42 GMT+0530 (India Standard Time)
నెత్తురోడిన రహదార్లు.. వేర్వేరు ప్రమాదాల్లో ఏడుగురు మృతి
ఏపీలోని చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం ఐతేపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. లారీని వెనుక నుంచి..

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రహదారులు నెత్తురోడాయి. ఈ రోజు జరిగిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఏడుగురు మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే.. ఏపీలోని చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం ఐతేపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. లారీని వెనుక నుంచి వచ్చిన కారు బలంగా ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. కారు నుజ్జునుజ్జవ్వగా.. అందులో ఉన్న నలుగురు మృతి చెందగా.. డ్రైవర్ తీవ్రగాయాలతో బయటపడ్డాడు. మృతుల్లో ఇద్దరు చున్నారులు కూడా ఉన్నారు. మృతులంతా విశాఖకు చెందినవారుగా గుర్తించారు.
తెలంగాణలోని నాగర్ కర్నూల్ జిల్లాలో జరిగిన మరో ప్రమాద ఘటనలో ముగ్గురు మృతి చెందారు. స్నేహితుడి పెళ్లికి వెళ్లి వస్తున్న ముగ్గురు రోడ్డుప్రమాదంలో మరణించడంతో.. ఆ కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. నల్గొండ జిల్లాకు చెందిన అరవింద్, శిరీష, రేణుక, కిరణ్మయి హైదరాబాదులోని హాస్టల్ లో ఉంటూ.. ఓ కాలేజీలో చదువుకుంటున్నారు. తమ స్నేహితుడి పెళ్లి నిమిత్తం వెల్దండ వెళ్లి.. పెళ్లి ముగిసిన అనంతరం తిరిగి హైదరాబాద్ వస్తుండగా.. నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం మార్తాల వద్ద కారు అదుపుతప్పి ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న శిరీష, కిరణ్మయి, అరవింద్ స్పాట్ లోనే మరణించగా.. రేణుక గాయపడింది. స్థానికుల సమాచారంతో ఘటనా ప్రాంతానికి చేరుకున్న పోలీసులు రేణుకను ఆస్పత్రికి తరలించారు.
News Summary - Seven Died in Two Different Road Accidents and two more injured
Next Story

