Thu Mar 19 2026 07:20:23 GMT+0530 (India Standard Time)
మలక్ పేట్ శిరీష మృతి కేసులో ఊహించని ట్విస్ట్
మలక్ పేట్ లో శిరీష మృతి కేసులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి

మలక్ పేట్ లో శిరీష మృతి కేసులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. శిరీషను ఆడపడుచు చంపిందని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. దీంతో పాటు ఈ హత్య తర్వాత శిరీష భర్త వినయ్ తన సోదరికి సహకరించారని కూడా పోలీసులు మీడియా సమావేశంలో తెలిపారు. మలక్ పేట్ జమునా టవర్స్ లో ఉంటున్న శిరీష అనుమానాస్పద స్థితిలో మరణించింది. అయితే శిరీష మరణించిన విషయాన్ని ఆమె మేనమామకు ఫోన్ చేసిన వినయ్ గుండెపోటుతో చనిపోయిందని చెప్పగా, మృతదేహాన్ని కదిలించవద్దని, తాను వస్తున్నానని, చెప్పినా వినకుండా తమ సొంత గ్రామమైన దోమల పెంటకు తరలిస్తుండగా మేనమామ పోలీసులకు ఫిర్యాదు చేసి వెనక్కు రప్పించారు.
గాయాలుండటంతో...
శిరీష్ దేహంపై గాయాలుండంతో పోస్టు మార్టం నిర్వహించిన వైద్యులు ఆమెకు ఊపిరి ఆడకుండా చేసినందునే మరణించినట్లు ధృవీకరించినట్లు పోలీసులు తెలిపారు. శిరీషను ఆమె భర్త సోదరి మత్తు మందు ఇచ్చి ఊపిరి ఆడకుండా హత్య చేసిందని పోలీసులు దాదాపుగా నిర్ణయానికి వచ్చారు. హనుమకొండ జిల్లా పరకాలకు చెందిన శిరీష తన చిన్న నాటే తల్లిదండ్రులు మరణించడంతో వినయ్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. శిరీషను ఒక ప్రొఫెసర్ పెంచుకుంటున్నారు. అయితే ప్రొఫెసర్ కు ఈ ప్రేమ వివాహం ఇష్టం లేకపోయినా చేసుకోకపోవడంతో వారు ఇక శిరీష ను గురించి పట్టించుకోవడం లేదు. అయితే గత కొంతకాలంగా ఆడపడచు, శిరీషల మధ్య గొడవలు జరుగుతున్నాయని పోలీసులు తెలిపారు.
అనుమానం.. విభేదాలే...
అయితే ఇందుకు కారణాలు ఏవనేవి బయటకు చెప్పకపోయినా భర్త వినయ్ కు శిరీష పై అనుమానం కూడా ఉండటంతో తరచూ ఆమెను వేధిస్తుండేవారని పోలీసులు తెలిపారు. కానీ ఆడపడుచుతో ఏర్పడిన విభేదాల వల్ల ఆమె శిరీషను మత్తు మందు ఇచ్చి ఊపిరి ఆడకుండా చేసిందని వైద్యులు తెలిపారు. మేనమామ ఇచ్చిన ఫిర్యాదుతో శిరీష భర్త వినయ్ తో పాటు వినయ్ సోదరిని కూడా పోలీసుల అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. అయితే పొంతన లేని సమాధానం చెప్పడంతో అనుమానం వచ్చి తమ దైన స్టయిల్ లో విచారించగా అసలు విషయం బయటకు వచ్చిందని అంటున్నారు. మొత్తం మీద శిరీషపై అనుమానం, ఆడపడుచు ప్రతీకారం వెరసి ఆమె మరణానికి కారణమయ్యాయని పోలీసులు మీడియాకు వివరించారు.
Next Story

