Fri Dec 05 2025 13:03:37 GMT+0000 (Coordinated Universal Time)
ఎలక్ట్రానిక్ షోరూమ్ లో చోరీ.. రూ.70 లక్షల విలువైన మొబైల్స్ స్వాహా
షోరూమ్ లో ల్యాప్ టాప్ లు, టీవీలు, మొబైల్స్, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులుండగా.. కేవలం మొబైల్స్ ను మాత్రమే చోరీ చేయడం..

భాగ్యనగరంలోని ఓ ఎలక్ట్రానిక్ షోరూమ్ కి కన్నమేసిన దొంగ.. ఏకంగా రూ.70 లక్షలకు పైగా విలువైన మొబైల్ ఫోన్లను ఎత్తుకెళ్లాడు. బుధవారం తెల్లవారుజామున 2.30 గంటలకు జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈసీఐఎల్ చౌరస్తాలో ఉన్న షోరూమ్ లో ఈ దొంగతనం జరిగింది. దొంగ తన ఫేస్ సీసీటీవీలో కనిపించకుండా జాగ్రత్తపడ్డాడు. ముందుగా షోరూమ్ మూలన ఉన్న వెంటిలేటర్ చువ్వలను కట్ చేసి లోపలికి వెళ్లాడు. అనంతరం సీసీటీవీ వైర్లను కట్ చేశాడు.
షోరూమ్ లో ల్యాప్ టాప్ లు, టీవీలు, మొబైల్స్, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులుండగా.. కేవలం మొబైల్స్ ను మాత్రమే చోరీ చేయడం గమనార్హం. 200కుపైగా ఐఫోన్, వివో, ఒప్పో, వన్ప్లస్ ఫోన్లను తీసుకుని పరారయ్యాడు. షోరూమ్ తెరిచిన సిబ్బంది చోరీ జరిగిన విషయాన్ని గుర్తించి జనరల్ మేనేజర్ కు సమాచారమిచ్చారు. సంస్థ జనరల్ మేనేజర్ మహ్మద్ హబీబ్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ బృందాలు షోరూంకు చేరుకుని ఆధారాలు సేకరించాయి. కాగా.. ఈ చోరీ తెలిసినవారి పనే అయి ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. దొంగ నేరుగా సెల్ఫోన్లు ఉండే చోటికి వెళ్లడం అందుకు ఊతమిస్తోంది.
Next Story

