Thu Feb 05 2026 06:40:32 GMT+0000 (Coordinated Universal Time)
పాకిస్థాన్ లో ఘోర రోడ్డుప్రమాదం.. 39 మంది మృతి
ప్రమాద సమయంలో బస్సులో సిబ్బంది సహా.. 48 మంది ఉన్నట్లు స్థానిక పోలీసులు వెల్లడించారు. బస్సు కాలువలో పడటంతో..

పాకిస్థాన్ లో ఆదివారం ఉదయం ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. బలూచిస్థాన్ ప్రాంతంలోని లాస్ బెలాలో ఓ బస్సు అదుపుతప్పి కాలువలో పడగా.. అందులో ప్రయాణిస్తోన్న 39 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రమాద సమయంలో బస్సులో సిబ్బంది సహా.. 48 మంది ఉన్నట్లు స్థానిక పోలీసులు వెల్లడించారు. బస్సు కాలువలో పడటంతో మంటలు చెలరేగగా.. చాలామంది ప్రయాణికులు సజీవదహనమైనట్లు తెలిపారు. మృతదేహాలు గుర్తుపట్టలేని రీతిలో కాలిపోయాయని వివరించారు.
క్వెట్టా నుండి కరాచీ వెళ్తున్న బస్సు ప్రమాదానికి గురైంది. మూలమలుపులో ఉన్న బ్రిడ్జి వద్ద బస్సు అదుపు తప్పిందని, రెయిలింగ్ ను ఢీకొని కాలువలో పడిపోయిందని తెలిపారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు వివరించారు. కాగా.. క్షతగాత్రుల్లోనూ కొందరి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరగవచ్చని తెలుస్తోంది. ఈ ప్రమాదంపై స్థానిక పాలకులు దిగ్భ్రాంతి చెందారు.
Next Story
