Sun Feb 01 2026 16:46:58 GMT+0000 (Coordinated Universal Time)
Road Accident: బైక్ పై నలుగురు ప్రయాణం.. ముంచుకొచ్చిన మృత్యువు
కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గండేపల్లి మండలం జగ్గంపేట సమీపంలోని మురారి జాతీయ రహదారిపై గుర్తుతెలియని వాహనం బైక్ ను ఢీకొట్టడంతో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందగా.. మహిళకి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం సమయంలో బైక్ పై నలుగురు ప్రయాణిస్తున్నారు. ఈ ప్రమాదంలో గాయపడిన మహిళను రాజమహేంద్రవరం ఆస్పత్రికి తరలించారు.
భీమవరం మండలం తాడేరుకు చెందిన నంగలం దుర్గ (40)కు ముగ్గురు కుమారులు రాజు (18), ఏసు (18), అఖిల్ (10) ఉన్నారు. దుర్గ, ఆమె కుమారులు కూలిపనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. నర్సీపట్నం వెళ్లి బైక్పై స్వగ్రామానికి తిరిగొస్తున్న సమయంలో ఆదివారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో గండేపల్లి మండలం మురారి శివారులో బైక్ అదుపు తప్పడంతో వారంతా కిందపడ్డారు. అదే సమయంలో వెనుక నుంచి వచ్చిన వాహనం వీరి పైనుంచి వెళ్లిందని తెలుస్తోంది. ఈ ప్రమాదంలో రాజు, ఏసు, అఖిల్ అక్కడికక్కడే మృతిచెందారు. దుర్గకు తీవ్ర గాయాలు కావడంతో ఆమెను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
Next Story

