Thu Dec 18 2025 10:18:57 GMT+0000 (Coordinated Universal Time)
అండమాన్ దీవుల్లో దారుణం.. గవర్నమెంట్ జాబ్స్ పేరుతో 20 మంది అమ్మాయిలపై..
తాను జాబ్ కోసం వెతుకుతూ ఉన్న సమయంలో తనకు ఓ హోటల్ యజమాని ద్వారా రిషి అనే వ్యక్తి పరిచయం అయ్యాడని..

అండమాన్ నికోబార్ దీవుల్లో దారుణం వెలుగుచూసింది. దీవుల మాజీ చీఫ్ సెక్రటరీ జితేంద్ర నరైన్ అమానుషాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. జితేంద్ర అండమాన్ చీఫ్ సెక్రటరీగా ఉన్న ఏడాది కాలంలో పోర్ట్ బ్లెయిర్లోని అతని నివాసానికి 20 మంది మహిళలను తీసుకెళ్లినట్లు దర్యాప్తులో తేలింది. జితేంద్ర నరైన్, లేబర్ కమిషనర్ ఆర్ఎల్ రిషి కలిసి 21ఏళ్ల యువతిపై సామూహిక అత్యాచారం చేయగా.. ఆ యువతి చేసిన ఫిర్యాదుతో ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది.
తాను జాబ్ కోసం వెతుకుతూ ఉన్న సమయంలో తనకు ఓ హోటల్ యజమాని ద్వారా రిషి అనే వ్యక్తి పరిచయం అయ్యాడని.. అతనే తనను చీఫ్ సెక్రటరీ కార్యాలయానికి తీసుకెళ్లాడని బాధితురాలు తెలిపింది. ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని నమ్మించి ఆర్ఎల్ రిషి, జితేంద్ర నరైన్ తనపై అత్యాచారం చేశారని, దాదాపు రెండు వారాలపాటు తనను తీవ్రంగా హింసించారని.. ఎవరికీ చెప్పొద్దని బెదిరించారని యువతి తన ఫిర్యాదులో పేర్కొంది.
ఇద్దరు అధికారుల కాల్ డేటా రికార్డులు, ఫోన్ టవర్ లొకేషన్స్.. యువతి చెప్పిన ఆధారాలతో సరిపోయాయని, ఇండియన్ ఎక్స్ ప్రెస్ నిర్వహించిన పరిశోధనలో తేలింది. సీసీటీవీ కెమెరా దృశ్యాలను పోర్ట్ బ్లెయిర్ నుంచి ఢిల్లీకి బదిలీ అయ్యే సమయంలో డిలీట్ చేసినట్లు నిర్దారించింది. నరైన్ ఏడాది కాలంలో ఇలా 20మంది యువతులను ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని నమ్మించి మోసం చేశాడని తేలింది. కాగా.. నరైన్ తనపై వచ్చిన ఆరోపణలను ఖండించారు. ఇందులో కుట్ర ఉందని ఆరోపించాడు. ఇదిలా ఉండగా.. నరైన్ ను కేంద్ర హోంశాఖ విధుల నుంచి తప్పించింది.
Next Story

