Thu Jan 22 2026 05:58:41 GMT+0000 (Coordinated Universal Time)
అంబులెన్స్ కు నిప్పు.. చిన్నారి సహా నలుగురి మృతి
ఎనిమిదేళ్ల బాలుడు టోన్సింగ్ తన తోటిపిల్లలతో ఆడుకుంటుండగా.. తుపాకీ శబ్దం వినిపించింది. తూటా బాలుడి తలకు తగలడంతో..

మణిపూర్ లో దారుణ ఘటన చోటుచేసుకుంది. రెండురోజుల క్రితం జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. అంబులెన్స్ కు నిప్పు అంటుకోవడంతో చిన్నారి సహా నలుగురు మృతి చెందారు. బుల్లెట్ గాయమైన బాలుడిని ఆసుపత్రికి తీసుకెళ్తుండగా ఈ ఘటన జరిగింది. మృతులు మీనా హాంసింగ్, ఆమె కుమారుడు టోన్సింగ్, బంధువు లిడియా గా గుర్తించారు. అస్సాం రైఫిల్స్ రిలీఫ్ క్యాంపులో ఉంటున్న వీరు.. ఆ పరిసరాల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో కొంతకాలంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేంద్రంలోనే ఉంటున్నారు.
ఎనిమిదేళ్ల బాలుడు టోన్సింగ్ తన తోటిపిల్లలతో ఆడుకుంటుండగా.. తుపాకీ శబ్దం వినిపించింది. తూటా బాలుడి తలకు తగలడంతో భద్రతా సిబ్బంది ఎదురు కాల్పులు జరిపారు. గాయపడిన బాలుడిని అంబులెన్సులో ఆసుపత్రికి తరలించారు. కొంతదూరం వరకూ భద్రతా సిబ్బంది రాగా.. ఆ తర్వాత మణిపూర్ పోలీసులకు బాధ్యత అప్పగించారు. అంబులెన్స్ ఆసుపత్రికి సమీపంలోకి రాగానే అల్లరిమూకలు నిప్పంటించాయి. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది స్వల్ప గాయాలతో బయటపడగా.. హాంసింగ్, టోన్సింగ్, లిండియాతో పాటు మరో చిన్నారి సజీవదహనమయ్యారు. ఈ ఘటన జరిగిన ప్రాంతం ఇంఫాల్ వెస్ట్ తో కాంగ్ పోక్సి జిల్లా సరిహద్దులో ఉంది. ఈ ఘటనపై అక్కడి ప్రభుత్వం ఎలా స్పందింస్తుందో చూడాలి.
Next Story

