Fri Dec 05 2025 13:36:29 GMT+0000 (Coordinated Universal Time)
మహిళపై మద్యం మత్తులో హత్యాయత్నం.. మహిళ మృతి
మద్యం మత్తులో ఉన్న యాదగిరి ఆమెతో వాదనకు దిగాడు. మాట మాట పెరగడంతో.. ఆగ్రహంతో యాదగిరి కవిత మెడ, కడుపుభాగంలో..

మేడ్చల్ : జొన్న రొట్టెలు చేస్తున్న మహిళను దుండగుడు కత్తితో పొడిచి చంపిన ఘటన మేడ్చల్ జిల్లా జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. జగద్గిరిగుట్ట షిరిడీ హిల్స్ కు చెందిన కవిత(35) తన ఇంటిముందే జొన్నరొట్టెలు చేసి, వాటిని అమ్ముకుంటూ జీవనం సాగిస్తోంది. యాదగిరి అనే వ్యక్తి వృత్తి రీత్యా గ్యాస్ సర్లయర్. అల్విన్ కాలనీలో నివాసం ఉంటున్నాడు. కవిత జొన్నరొట్టెలు చేస్తున్న సమయంలో.. యాదగిరి ఆమె వద్దకు వచ్చాడు.
అప్పటికే మద్యం మత్తులో ఉన్న యాదగిరి ఆమెతో వాదనకు దిగాడు. మాట మాట పెరగడంతో.. ఆగ్రహంతో యాదగిరి కవిత మెడ, కడుపుభాగంలో తనవెంట తెచ్చుకున్న కత్తితో పొడిచాడు. స్థానికులు గమనించి వెంటనే కవిత స్థానిక ఆస్పత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. కాగా.. కవితను పొడిచిన వెంటనే యాదగిరి పరారయ్యేందుకు ప్రయత్నించగా.. స్థానికులు అతడిని పట్టుకుని, దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. జగద్గిరిగుట్ట పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story

