Sat Jul 27 2024 05:35:45 GMT+0000 (Coordinated Universal Time)
మద్యం తాగొద్దనడంతో.. భర్త ఆత్మహత్య
నువ్వు నన్ను మద్యం తాగొద్దని ఆపుతున్నావు. నేను చచ్చిపోతా అంటూ సిద్ధు పారిపోయాడు. ఇంటి నుంచి వెళ్లిపోయిన సిద్దు కుమార్..
జీవితం విలువ తెలుసుకోకుండా.. చిన్న చిన్న కారణాలకే మనస్తాపంతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. భార్య మద్యం తాగొద్దని చెప్పినందుకు మనస్తాపానికి గురైన భర్త బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ విషాద ఘటన సిద్ధిపేటపట్టణంలోని దోభిగల్లీలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. భూంపల్లి సిద్దుకుమార్(32) మద్యానికి బానిసయ్యాడు. ప్రతినిత్యం మద్యం తాగనిదే ఇంటికొచ్చేవాడు కాదు. బుధవారం కూడా సిద్ధు మద్యం తాగి ఇంటికి వెళ్లి భార్యను భోజనం పెట్టాలని అడిగాడు. భోజనం చేసి.. మళ్లీ మద్యం తాగేందుకు బయల్దేరాడు.
ఈ క్రమంలో భార్య అతడిని అడ్డుకుంది. మద్యం తాగొద్దని బ్రతిమాలింది. వారించింది. ఇద్దరి మధ్యన స్వల్ప వాదన కూడా జరిగింది. నువ్వు నన్ను మద్యం తాగొద్దని ఆపుతున్నావు. నేను చచ్చిపోతా అంటూ సిద్ధు పారిపోయాడు. ఇంటి నుంచి వెళ్లిపోయిన సిద్దు కుమార్ కోసం అతని భార్య, బంధువులు భూంపల్లి సాయికృష్ణ, నాగరాజు కలిసి వెతికారు. వ్యవసాయ క్షేత్రాల్లో రైతులను ఆరా తీయగా వారు చెప్పిన ప్రకారం వెతకగా.. ఓ బావిలో సిద్దు కుమార్ పడి ఉండటాన్ని గమనించి, అతడిని బయటకు తీశారు. కానీ అప్పటికే అతను మరణించాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టమ్ కు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story