Wed May 15 2024 11:29:37 GMT+0000 (Coordinated Universal Time)
కోడికూర వండనన్న భార్య.. కోపంతో భర్త ఆత్మహత్య
మార్చి 25న సాయంత్రం మద్యంతాగిన రతన్ లాల్.. చికెన్ తీసుకుని ఇంటికెళ్లాడు. భార్య రాధికకు ఇచ్చి వండమని చెప్పాడు. కుమార్తెకు..
హైదరాబాద్ : ఇంట్లో అమ్మవారు (చికెన్ పాక్స్) సోకిన కుమార్తె ఉండటంతో.. భార్య చికెన్ కర్రీ చేయడం కుదరదని చెప్పగా.. కోపంతో భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా దుండిగల్ లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు మహబూబ్ నగర్ జిల్లా కేతిరెడ్డిపల్లి చింతకుంటతండాకు చెందిన రతన్ లాల్(32) ఆటో డ్రైవర్. బ్రతుకుదెరువు కోసం మూడేళ్ల క్రితం భార్య రాధిక, ఇద్దరు కొడుకులు, కూతురితో కలిసి హైదరాబాద్ నగరంలోని దుండిగల్ కు వచ్చి, అక్కడే నివాసముంటున్నాడు.
మార్చి 25న సాయంత్రం మద్యంతాగిన రతన్ లాల్.. చికెన్ తీసుకుని ఇంటికెళ్లాడు. భార్య రాధికకు ఇచ్చి వండమని చెప్పాడు. కుమార్తెకు చికెన్ పాక్స్ సోకడంతో ఇంట్లో కోడికూర వండకూడదని భర్తకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించింది. అయినా అతను వినిపించుకోలేదు. మర్నాడు ఉదయం తల్లికి ఫోన్ చేసి తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు చెప్పాడు. ఆపై యాసిడ్ తాగి ఇంటికొచ్చాడు.
తీవ్ర అస్వస్థతకు గురైన అతడిని వెంటనే ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నాడు. చికెన్ కర్రీ కోసం ఆత్మహత్య చేసుకోవడం లేదా హత్య చేయడం పరిపాటిగా మారింది. గతంలో ఏపీలో చికెన్ కూర కోసం ఓ హత్య జరిగింది. చెల్లి కోడికూర వండలేదని ఆమెను అన్న నరికి చంపాడు.
Next Story