Thu Mar 19 2026 12:36:14 GMT+0530 (India Standard Time)
స్నేహితుడి చితిమంటల్లో దూకిన వ్యక్తి
పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. నాగ్లా ఖాంగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంటున్న అశోక్ (42) కొంతకాలంగా క్యాన్సర్ తో బాధపడుతూ

స్నేహితుడు లేనిదే బ్రతకలేను అనుకున్నాడో లేక.. వేరే ఇతర కారణాలున్నాయోగానీ.. స్నేహితుడి అంత్యక్రియలకు హాజరైన వ్యక్తి.. అతని చితిమంటల్లో దూకి మృతి చెందాడు. ఈ విషాద ఘటన ఉత్తరప్రదేశ్ లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. నాగ్లా ఖాంగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంటున్న అశోక్ (42) కొంతకాలంగా క్యాన్సర్ తో బాధపడుతూ.. మే 27 శనివారం ఉదయం మరణించాడు. ఉదయం 11 గంటలకు అశోక్ అంత్యక్రియలను యమునానదీ తీరంలో నిర్వహించారు. స్నేహితుడి మరణం గురించి తెలిసి ఆనంద్ (40) కూడా అంత్యక్రియలకు హాజరయ్యాడు.
అశోక్ చితికి నిప్పంటించాక అందరూ తిరిగి వెళ్లిపోతుండగా.. ఆనంద్ ఒక్కసారిగా అశోక్ చితిపైకి దూకేశాడు. మంటల్లో కాలిపోతున్న అతడిని అక్కడున్న వారు రక్షించి, మంటలను ఆర్పి వెంటనే జిల్లా ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ఆనంద్ కు అత్యవసర చికిత్స అందించి, ఆగ్రా మెడికల్ కాలేజీకి తీసుకెళ్లాలని రిఫర్ చేశారు. అక్కడికి తరలిస్తుండగా ఆనంద్ మరణించాడు. ఆనంద్ మృతిపై అతని కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
Next Story

