Sat Mar 07 2026 19:17:49 GMT+0530 (India Standard Time)
మహిళ సహా ముగ్గురిపై యాసిడ్ దాడి.. కారణం?
ఐతవరంకు చెందిన తిరుపతమ్మ అనే మహిళకు వివాహమయింది. భర్తతో గొడవల కారణంగా ఇద్దరూ విడిపోయారు. ఆ తర్వాత సోషల్ మీడియాలో..

తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలో క్రైం రేటు రోజురోజుకూ పెరిగిపోతుంది. మహిళలపై దాడులు, అత్యాచారాలు, మర్డర్లతో.. ఎటుచూసినా ఏదొక దారుణ ఉదంతం కనిపిస్తోంది. ఏలూరులో వివాహితపై యాసిడ్ దాడి ఘటన మరువక ముందే.. మరో మహిళ సహా ముగ్గురిపై యాసిడ్ దాడి జరిగింది. ఎన్టీఆర్ జిల్లాలో జరిగిన ఈ దాడిలో.. తీవ్రంగా గాయపడిన ముగ్గురిని విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే..
ఐతవరంకు చెందిన తిరుపతమ్మ అనే మహిళకు వివాహమయింది. భర్తతో గొడవల కారణంగా ఇద్దరూ విడిపోయారు. ఆ తర్వాత సోషల్ మీడియాలో మణిసింగ్ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. వీరిద్దరి మధ్య పరిచయం సహజీవనానికి దారితీసింది. ఇటీవల మణిసింగ్ అస్వస్థతకు గురవ్వగా.. అప్పటి నుంచి అతడిని తిరుపతమ్మ దూరంగా ఉంచేందుకు ప్రయత్నిస్తోందని మణిసింగ్ అనుమానిస్తున్నాడు. ఇదే సమయంలో తిరుపతమ్మకు ఆమె కుటుంబ సభ్యులు మరో వివాహం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని తెలుసుకున్న మణిసింగ్.. కోపంతో రగిలిపోయాడు. ఎలాగైనా ఆమెను అంతమొందించాలని ప్లాన్ చేశాడు.
ప్లాన్ ప్రకారం.. శనివారం (జులై8) రాత్రి తిరుపతమ్మ ఇంట్లోనే ఉన్న మణిసింగ్ ఆదివారం తెల్లవారుజామున తిరుపతమ్మతో పాటు ఆమె కొడుకు, తిరుపతమ్మ బంధువు కూతురిపై యాసిడ్ పోశాడు. తీవ్రగాయాలతో ఆర్తనాదాలు చేసిన ముగ్గురినీ స్థానికులు హుటాహుటిన గొల్లపూడి ఆసుపత్రికి తరలించారు. అక్కడికి చేరుకున్న జిల్లా పోలీస్ ఉన్నతాధికారులు బాధితులను పరామర్శించారు. వారి ఆరోగ్యంపై వైద్యుల్ని ఆరా తీసి, బాధితులు పేర్కొన్న వివరాల ప్రకారం.. ఘటనకు కారణమైన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు.
Next Story

