Sat May 18 2024 12:15:05 GMT+0000 (Coordinated Universal Time)
కారును ఈడ్చుకెళ్లిన లారీ.. ప్రాణాలతో బయటపడ్డ ఇద్దరు వ్యక్తులు
దుర్గానగర్ నుండి చాంద్రాయణ గుట్ట వైపు వెళ్తున్న సమయంలో ఓ మారుతి కారు టైరు ఒక్కసారిగా పేలిపోయింది. దీంతో కారు అదుపుతప్పి..
మృత్యువు ఎప్పుడు ఏ విధంగా కబళిస్తుందో ఎవరికి తెలియదు. కొన్ని సందర్భాల్లో జరిగే ప్రమాదాలలో కొంతమంది మృత్యువుతో పోరాడి ప్రాణాలతో బయటపడతారు. ఆ విధంగా ప్రాణాలతో బయటపడడం నిజంగా దేవుడు ఇచ్చిన వరం. ఇలాంటి సంఘటనే రంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. ఓ లారీ అత్యంత వేగంగా కారును ఈడ్చుకుంటూ వెళ్లినా కూడా కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు ప్రాణాలతో బయట పడ్డారు. ఈ ఘటన అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. రంగారెడ్డి జిల్లాలోని మైలార్ దేవ్ పల్లి దుర్గానగర్ వద్ద రోడ్డు ప్రమాదం సంభవించింది.
దుర్గానగర్ నుండి చాంద్రాయణ గుట్ట వైపు వెళ్తున్న సమయంలో ఓ మారుతి కారు టైరు ఒక్కసారిగా పేలిపోయింది. దీంతో కారు అదుపుతప్పి పక్కన వెళ్తున్న లారీని ఢీకొట్టింది. అత్యంత స్పీడులో ఉన్న ఆ లారీ.. కారును ఈడ్చుకుంటూ కొంత దూరం వరకు వెళ్ళింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులకు స్వల్పగాయాలయ్యాయి. ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు అక్కడున్న సీసీటీవీ కెమెరాలో రికార్డు అయ్యాయి. పోలీసులు సమాచారం అందుకున్న వెంటనే ఘటన స్థలానికి చేరుకున్నారు. ఘటనను చూసిన స్థానికులు తృటిలో పెను ప్రమాదం తప్పి కారులోని ఇద్దరు వ్యక్తులు సురక్షితంగా బయటపడటంతో ఊపిరి పీల్చుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story