Thu May 02 2024 00:16:30 GMT+0000 (Coordinated Universal Time)
లోన్ రికవరీ ఏజెంట్ నిర్వాకం.. మహిళ ఫొటోను మార్ఫింగ్ చేసి..
డబ్బు తీసుకుని కట్టకుండా వ్యక్తి కాంటాక్ట్ లిస్ట్ లకు ఈ రికవరీ ఏజెంట్స్ డబ్బులు కట్టలేదని.. మీపై కూడా చర్యలు తప్పవని మెసేజీలు, కాల్
హైదరాబాద్ : ఇన్స్టంట్ లోన్ యాప్ల రికవరీ ఏజెంట్ల నుంచి ఎంతో మంది వేధింపులను ఎదుర్కొంటూ ఉన్నారు. గత కొన్ని నెలలుగా పలువురు సహాయం కోసం హైదరాబాద్ పోలీసులను ఆశ్రయించారు. యాప్లు అధిక వడ్డీ రేట్లు, ప్రాసెసింగ్ రుసుములతో నిమిషాల్లో లోన్లను అందించడం ద్వారా ప్రజలను ఆకర్షిస్తున్నాయి. కట్టకపోతే మాత్రం టార్చర్ ను పెడుతూ ఉన్నాయి. రికవరీ ఏజెంట్లు నీచాతినీచంగా ప్రవర్తిస్తూ వస్తున్నారు. కొందరు వ్యక్తులు ఈ టార్చర్ ను తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్నారు.
డబ్బు తీసుకుని కట్టకుండా వ్యక్తి కాంటాక్ట్ లిస్ట్ లకు ఈ రికవరీ ఏజెంట్స్ డబ్బులు కట్టలేదని.. మీపై కూడా చర్యలు తప్పవని మెసేజీలు, కాల్ చేయడం, ఫోటోలు మార్ఫింగ్ చేయడం వంటివి చేస్తూ ఉంటారు. చాలా మంది బాధితులు లోన్ రికవరీ ఏజెంట్లకు పెద్ద ఎత్తున డబ్బులను చెల్లించారు. ముఖ్యంగా లోన్ తీసుకున్న వారి ఫోటోలను నగ్న చిత్రాలుగా మార్ఫింగ్ చేయించడం, వారి కుటుంబ సభ్యులకు.. ఇతర కాంటాక్ట్స్ కు పంపిస్తామంటూ బెదిరిస్తూ ఉంటారు. రుణాల వసూళ్ల పేరుతో బాధితులను బ్లాక్ మెయిల్ చేస్తూ వేధింపులకు గురిచేస్తూ ఫోన్ కాల్స్ ద్వారా అసభ్యపదజాలంతో బెదిరింపులకు పాల్పడుతున్న బీహార్కు చెందిన మనీష్ కుమార్ అనే వ్యక్తిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు.
ఇన్స్టంట్ ఆన్లైన్ లోన్ యాప్ ద్వారా లోన్ తీసుకున్నట్లు హైదరాబాద్ మహిళ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా బీహార్కు చెందిన 23 ఏళ్ల మనీష్ కుమార్ను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమె తన EMIలను చెల్లించడంలో విఫలమవ్వగా అప్పటి నుండి వేధింపులకు పాల్పడుతూ ఉండడం మొదలుపెట్టాడు. వాట్సాప్లో నగ్న ఫోటోలను మార్ఫింగ్ చేయడం వంటివి చేయడంతో ఆమె మానసికంగా ఎంతో ఇబ్బందులను ఎదుర్కొందని పోలీసులు తెలిపారు. కాల్ డిటెయిల్ రికార్డ్ (CDR) విశ్లేషణ ఆధారంగా, మనీష్ కుమార్ బాధితురాలికి అసభ్యకరమైన సందేశాలు పంపుతున్నట్లు గుర్తించిన పోలీసులు, బీహార్ నుండి అతన్ని అరెస్టు చేశారు.
మనీష్ కుమార్ బికినీ యాప్తో లోన్ యాప్ కస్టమర్ల ఫోటోలను నగ్న ఫోటోలతో మార్ఫింగ్ చేసేవాడని, వాటిని బాధితుల కుటుంబం, బంధువులు, ఇతర కాంటాక్ట్ లకు పంపి పరువు తీయడానికి ప్రయత్నించేవాడు. రుణం వసూలు చేసే సాకుతో వారిని వేధించేవాడని పోలీసులు తెలిపారు. నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న మొబైల్ ఫోన్లో రుణం తీసుకున్న ఖాతాదారుల వివరాలతోపాటు వారి ఆధార్, పాన్ కార్డులు, నిందితులు మోసపోయిన కొంతమంది బాధితుల వివరాలు ఉన్నాయని పోలీసులు తెలిపారు.
Next Story