Tue Apr 23 2024 15:01:47 GMT+0000 (Coordinated Universal Time)
బర్త్ డే రోజే నటి, మోడల్ అనుమానాస్పద మృతి
కాసర్ గోడ్ లోని పరంబిల్ బజార్ లో భర్తతో కలిసి ఉంటున్న.. షహానా ఇంటి బాత్రూం కిటికీ రెయిలింగ్ కు ఉరివేసుకుని విగతజీవిగా..
కేరళ : పుట్టినరోజే ఆమెకు ఆఖరి రోజైంది. బర్త్ డే రోజు కుటుంబ సభ్యులను కలవాలనకున్న ఆమె అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. తమ కూతుర్ని భర్తే చంపి ఉంటాడని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. కేరళలోని కోజికోడ్ కు చెందిన మోడల్, నటి షహానా మే 12న 21వ పుట్టినరోజును జరుపుకుంది. తల్లిదండ్రులను కలిసి.. పుట్టినరోజు ఆశీర్వాదం తీసుకోవాలనుకుంది. కానీ.. ఆమెను మృత్యువు కబళించింది.
కాసర్ గోడ్ లోని పరంబిల్ బజార్ లో భర్తతో కలిసి ఉంటున్న.. షహానా ఇంటి బాత్రూం కిటికీ రెయిలింగ్ కు ఉరివేసుకుని విగతజీవిగా కనిపించింది. కూతురు చనిపోయిందని తెలుసుకున్న తల్లిదండ్రులు.. అత్తింటి వేధింపులకు షహానా బలైందని ఆరోపించారు. షహానాను చిత్రహింసలకు గురిచేశారని, భర్త సజ్జాద్ తాగొచ్చి నిత్యం కొట్టేవాడని తల్లి చెప్తోంది. వేధింపులు తాళలేక కొన్నాళ్లుగా తన భర్తతో విడిగా ఉంటుందని, అయినా వేధింపులు తగ్గలేదన్నారు. భర్త ఆమె వద్దనున్న 25 సవర్ల బంగారాన్ని వాడుకున్నాడన్నారు. షహానా పలు జ్యూయలరీ యాడ్స్ లో నటించింది. ఇటీవల షహానా ఒక తమిళ ప్రాజెక్ట్ లో నటించినందుకు గానూ ఆమెకు పారితోషికం లభించింది. ఆ డబ్బు గురించే భార్యాభర్తల మధ్య గొడవ జరిగి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు. షహానా తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story